హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): వరి రైతులపై కేంద్ర ప్రభుత్వం పగబట్టింది. వారి బతుకులను ఆగం చేసేలా రోజుకో రకమైన నిర్ణయం తీసుకొంటున్నది. మొన్న బాయిల్డ్ రైస్ పేరుతో, నిన్న రా రైస్ పేరుతో కొర్రీలు పెట్టిన నరేంద్రమోదీ సర్కారు.. ఇప్పుడు ఏకంగా ధాన్యం కొనుగోళ్లపైనే ఆంక్షలు పెట్టే దిశగా అడుగులు వేస్తున్నది. దేశంలో ధాన్యం నిల్వలను తగ్గించేందుకు కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) నివేదిక ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. చిన్న, సన్నకారు రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, మిగిలిన రైతులను 5 ఎకరాలకే పరిమితం చేయాలని, ఇలా సేకరించిన ధాన్యం దేశంలో ఆహార భద్రతకు సరిపోతుందని ఆ నివేదికలో పేర్కొన్నది. రైతులను క్రమంగా వరి సాగు నుంచి తప్పించి.. నూనె, పప్పుగింజల సాగును ప్రోత్సహించాలని సీఏసీపీ తెలిపింది.
అంతేకాకుండా తృణ ధాన్యాల కొనుగోలుపైనా పరిమితులు పెట్టాలని సూచించింది. దీంతో ధాన్యం కొనుగోళ్ల నుంచి క్రమంగా తప్పించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు స్పష్టమవుతున్నదని వ్యవసాయ నిపుణులు మండిపడుతున్నారు. ఈ ఆలోచన దేశాన్ని ఆహార సంక్షోభం దిశగా తీసుకెళ్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం చిన్న, సన్నకారు రైతులు సాగుచేసే వరితో దేశ అవసరాలను తీర్చగలరా?
అని ప్రశ్నిస్తున్నారు. సీఏసీపీ నివేదిక ప్రకారం.. 5 ఎకరాలకు మించి వరి పండించే రైతుల నుంచి కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదు. ఆ రైతులు ఎంత నష్టాన్నైనా భరించి తమ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 10 లక్షల మంది రైతులకు తీవ్ర నష్టం జరుగనున్నది. వీరంతా వ్యవసాయానికి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. కౌలు రైతులు కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఇదే జరిగితే వీరంతా రోడ్డున పడి మళ్లీ వ్యవసాయ కూలీలుగా మారి అవకాశాలు ఉన్నాయి.
మొన్నటి వరకు రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని గప్పాలు కొట్టిన కేంద్రం.. ఇప్పుడు చేతులెత్తేస్తున్నది. క్రమంగా ధాన్యం కొనుగోళ్ల నుంచి తప్పించుకొనే కుట్ర చేస్తున్నది. గత కొంత కాలంగా ధాన్యం కొనుగోళ్లపై షరతులు విధించడం, కొనుగోళ్లను తగ్గించడం ఇందుకు నిదర్శనం. 2020-21తో పోల్చితే 2021-22లో 40 లక్షల మంది రైతుల నుంచి సుమారు 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లను తగ్గించింది. అదే విధంగా యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని చెప్పడం కూడా ఇందులో మొదటి అంకమనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు రా రైస్కు బదులుగా ఫోర్టిఫైడ్ రైస్ కావాలంటూ కొత్తరకం కొర్రీ పెడుతున్నది. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి షరతులు విధిస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది.
వరి సాగు తగ్గించి పప్పులు, నూనె గింజల సాగు పెంచేలా రైతులను ప్రోత్సహించాలని సీఏసీపీ తన నివేదికలో సూచించింది. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. కానీ కేంద్రం మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు మాత్రం గడప దాటడంలేదు. పప్పులు, నూనె గింజల సాగును పెంచాలని చెబుతున్నా అందుకు తగిన ప్రోత్సాహం అందించడంలేదు. రెండు రోజుల క్రితం మోదీ సర్కారు ప్రకటించిన మద్దతు ధరలతోనూ ఈ పంటలు సాగుచేసే రైతులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు.
పప్పులు, నూనె గింజలకు కేంద్రం పెంచిన మద్దతు ధర చాలా తక్కువగా ఉన్నది. క్వింటాలు పెసర సాగుకు రూ.10,217 ఖర్చు చేస్తున్న రైతుకు కేంద్రం ఇస్తున్న మద్దతు ధర రూ.7,755 మాత్రమే. గత ఏడాదితో పోల్చితే పెరసరకు 6.5% మాత్రమే ధర పెంచడం గమనార్హం. అదే విధంగా క్వింటాలు కంది సాగుకు రూ.12,016 ఖర్చు అవుతుంటే కేంద్రం రూ.6,600 మద్దతు ధర మాత్రమే ఇస్తున్నది. గత ఏడాదితో పోల్చితే 4.7 శాతం మాత్రమే మద్దతు ధర పెంచడం గమనార్హం.
క్వింటాలు జొన్నల సాగుకు రూ.12,595 ఖర్చు పెడుతున్న రైతుకు కేంద్రం రూ.2,970 మాత్రమే చెల్లిస్తున్నది. అంటే జొన్న రైతు ప్రతి క్వింటాలుకు రూ.9,625 నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. క్వింటాలు వేరుశనగ సాగుకు రూ.6,615 ఖర్చు అవుతుంటే కేంద్రం మాత్రం మద్దతు ధరగా రూ.5,850 ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే ఈ పంట ధర 5.4% మాత్రమే పెంచింది. ఈ నేపథ్యంలో రైతులు నూనె, పప్పు పంటల సాగువైపు మళ్లాలంటే మద్దతు ధర మరింతగా పెంచాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు.
వాస్తవానికి ధాన్యం కొనుగోళ్ల విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వం మొదటి నుంచే కొర్రీలు పెడుతున్నది. మొన్నటి వరకు దేశంలో బాయిల్డ్ రైస్ నిల్వలు అధికంగా ఉన్నాయంటూ పలు రాష్ర్టాల రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు నిరాకరించింది. నిన్నటికి నిన్న రా రైస్ కాకుండా ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలంటూ మరో కొర్రీ పెట్టింది. ఇప్పుడు కేవలం సన్న, చిన్నకారు రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేయాలనే ఆలోచనతో మరో కుట్రకు తెరలేపింది.
వడ్ల సాగుతో రైతులకు ఎంతో కొంత లాభం వస్తున్నది. ఇప్పుడు ఆ లాభాన్ని కూడా లాగేసుకొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తుండటం గమనార్హం. మోదీ సర్కారు ఆనాలోచిత నిర్ణయాలతో దేశంలోని ప్రధాన వరిసాగు రాష్ర్టాలైన తెలంగాణ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రైతులకు తీరని నష్టం జరుగనున్నది. ఈ రాష్ర్టాల్లో అత్యధిక రైతులు వరి పంటనే సాగు చేస్తారు. వారిలో చాలా మందికి 5 ఎకరాలకుపైగానే వ్యవసాయ భూమి ఉన్నది.
సీఏసీపీ తాజా నివేదికతో తెలంగాణలోని వరి రైతులకు తీరని నష్టం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని మెజార్టీ రైతులు వరిసాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో ఇతర పంటలు పండే అవకాశం తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు వరి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. 2014-15లో రాష్ట్రంలో 24.27 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా.. 2020-21లో అది ఏకంగా 1.40 కోట్ల టన్నులకు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని చెప్పడంతో యాసంగిలో ఏ పంట సాగుచేయాలో తెలియక రైతులు భూమిని పడావు పెడుతున్నారు.