నల్లగొండ, ఫిబ్రవరి 20: ‘రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ, రైతు పథకాలు ప్రధాని మోదీని కలవరపెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తదనే భయంతో మోదీ అండ్ గ్యాంగ్ సీఎం కేసీఆర్ను నిలువరించే కుట్ర చేస్తున్నది. తెలంగాణలో రైతు పథకాలను ఆపి వ్యవసాయాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రకు తెరలేపింది. రైతులు దీనిని ప్రతిఘటించి బీజేపీ జెండాలను ఊళ్లల్లోకి రానివ్వకుండా ఎదుర్కోవాలి’ అని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో నిర్వహించిన రైతుబంధు సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అమలవుతున్న 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ మోదీ సర్కార్ను కలవర పెడుతున్నాయని అన్నారు. 27 ఏండ్లుగా గుజరాత్లో, 22 ఏండ్లుగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో బీజేపీ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ర్టాల్లో అధికారంలో ఉండి ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
దేశంలో బీజేపీ చేస్తున్న దేశ ద్రోహం గురించి సీఎం కేసీఆర్ రెండు గంటలపాటు చెప్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారని నిలదీశారు. కేసీఆర్ గురించి, ఇక్కడి పథకాల గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని, దీనిపై ప్రశ్నిస్తారనే భయంతోనే ముఖ్యమంత్రిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పథకాలను చూసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎంతో ఆశ్చర్యపోయి ప్రశంసించినట్టు తెలిపారు.
ఇటీవల రాష్ర్టానికి వచ్చిన ఛత్తీస్గఢ్ వ్యవసాయశాఖ మంత్రి కూడా ఇలాంటి అభివృద్ధి ఎక్కడా చూడలేదని మెచ్చుకున్నట్టు గుర్తుచేశారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్కుమార్, షీప్ అండ్ గోట్స్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి పాల్గొన్నారు.