రీడ్ బిట్విన్ ది లైన్స్
(కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు. కొంచం లోతుగా విశ్లేషిస్తే.. కనిపిస్తున్న దృశ్యం వెనుక జరుగుతున్న అసలు తంతుఏమిటో అర్థమవుతుంది)
1862లో ఓ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు స్టోరీని ప్రచురిస్తూ ‘న్యూయార్క్ టైమ్స్’ ఉటంకించిన ఈ ఒక్క వాక్యం.. ఆ దేశ రాజకీయాల్లో పెను మార్పులను తీసుకొచ్చింది.
ఆస్ట్రేలియా-భారత్ మధ్య అహ్మదాబాద్లో నాలుగో టెస్ట్ మ్యాచ్. ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ గురువారం ఈ మ్యాచ్కు హాజరై.. సందడి చేశారు. అందరికీ అర్థమైంది ఇక్కడివరకే.
నౌ.. రీడ్ బిట్విన్ ది లైన్స్
హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో.. గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో నిరసనలు పెచ్చరిల్లుతున్నాయి. ఇదే సమయంలో ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ భారత్కు వచ్చారు. ఆయన పర్యటనకు ముందే, కొందరు ఆస్ట్రేలియా రాజకీయ ప్రముఖులు అదానీకి సపోర్ట్గా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారత్కు వచ్చిన ఆంటోనీతో మ్యాచ్ అరగంట చూసిన మోదీ ఆయనతో ఏకాంతంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందాల గురించి ఏదైనా ప్రకటన వస్తుందని అందరూ అనుకొన్నారు. అయితే, అలా జరుగలేదు. ఎందుకు? ఇరు దేశాల ప్రధానుల మధ్య జరిగిన చర్చ మరో ‘దోస్త్ కహానీ’ గురించి కావడమే దీనికి కారణంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దోస్త్ ఎవరో కాదు.. మోదీ ఆప్తమిత్రుడు!
(కడవేర్గు రాజశేఖర్)
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): బోర్డర్-గావస్కర్ సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మోదీ స్వరాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్లో నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ను ఇరు దేశాల ప్రధానులు ప్రత్యేక గ్యాలరీలో కూర్చొని అరగంట పాటు వీక్షించారు. అంతకు ముందు పసిడి పూత పూసిన గోల్ఫ్ కారులో మైదానమంతా కలియదిరిగారు. 75 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ త్రూ క్రికెట్ పేరిట.. 75 ఏండ్ల ఇండో-ఆస్ట్రేలియా మైత్రీ సంబురాల్లో భాగంగా ఇదంతా చేసినట్టు మోదీ పరివారం చెప్పుకొచ్చింది. అయితే, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. దీని వెనుకాల అసలు కథ మరొకటి ఉన్నదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
1947లో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. కిందటేడాదితో.. ఇరుదేశాలు 75 ఏండ్ల క్రికెట్ మైత్రీబంధాన్ని పూర్తి చేసుకొన్నాయి. ఒకవేళ వీటిని వేడుకగా జరుపుకోవాలంటే, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీని కేంద్రప్రభుత్వం, బీసీసీఐ అప్పుడే ఆహ్వానించాలి. అలా జరుగలేదు. పోనీ.. బోర్డర్-గావస్కర్ సిరీస్ మొదలైన ఫిబ్రవరి 9న అయినా.. పిలిచారా అంటే? అదీ జరుగలేదు. ఆస్ట్రేలియాలోని అదానీ గనులు, ప్లాంట్లకు వ్యతిరేకంగా అప్పటికే కొనసాగుతున్న నిరసనలు హిండెన్బర్గ్ నివేదిక వెలువడ్డాక, గత నెలలో మరో స్థాయికి వెళ్లాయి. అదానీ గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వొద్దంటూ ఆస్ట్రేలియా బ్యాంకుల ఎదుట అక్కడి పౌరులు ఫిబ్రవరి రెండో వారంలో పెద్దయెత్తున నిరసనలు చేపట్టారు. దీంతో నార్వే వెల్త్ ఫండ్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు అదానీ కంపెనీలపై ఆంక్షలు విధించాయి. నిరసనలను చల్లార్చేందుకు ఆస్ట్రేలియాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు యత్నాలు మొదలెట్టారు. భారత్ నుంచి అతిపెద్ద పెట్టుబడీదారుగా ఉన్న అదానీ గ్రూప్పై తమకు పూర్తి విశ్వాసం ఉన్నదంటూ ఆస్ట్రేలియా హైకమిషనర్ బేరీ ఓ ఫారెల్ పేర్కొన్నారు. అదానీ గ్రూప్ నుంచి మరికొన్ని పెట్టుబడులను ఆశిస్తున్నామంటూ మాజీ ప్రధాని టోనీ అబాట్ వెల్లడించారు. సరిగ్గా, ప్రధాని ఆంటోనీ భారత్ పర్యటనకు ముందే వీళ్లు అదానీకి అనుకూలంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
భారత పర్యటన గురించి గత డిసెంబర్లోనే ఆంటోనీ ఓ ట్వీట్ చేశారు. అయితే, అధికారికంగా దాన్ని ఆయన కార్యాలయం మొన్నటివరకూ ధ్రువీకరించలేదు. అయితే, అదానీ గ్రూప్పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. హడావుడిగా పర్యటన ఖరారు అయినట్టు తెలుస్తున్నది. ఆస్ట్రేలియాలో అదానీ కంపెనీకి బొగ్గు గనుల ప్రాజెక్టు అనుమతులను ఇప్పించడానికే 2014లో మోదీ ఆ దేశంలో పర్యటించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదానీ కంపెనీలపై ఆస్ట్రేలియాలో పెద్దయెత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆంటోనీ భారత పర్యటనకు వస్తే.. ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తాయన్న కారణంతో.. 75 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ త్రూ క్రికెట్ పేరిట గురువారం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్ నాల్గో టెస్ట్ మ్యాచ్ను ఓ సాకుగా చూపించినట్టు తెలుస్తున్నది. మ్యాచ్ జరిగిన తర్వాత.. మోదీ, ఆంటోనీ ఏకాంతంగా భేటీ ఆయ్యారు. ఇరు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలపై వారిద్దరి మధ్య చర్చ జరుగొచ్చని అందరూ భావించారు. అయితే, అలా జరుగలేదు. ఒకవేళ దౌత్య సంబంధాలు, ఒప్పందాలపై చర్చ జరిగితే, పీఎంవో గానీ, ఇరు దేశాల ఎంబసీలు గానీ అధికారిక ప్రకటనలు, మీటింగ్ మినట్స్ సారాంశాన్ని విడుదల చేసేవని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అలా ఏమీ జరుగలేదు. తన మిత్రుడు అదానీకి సంబంధించిన వివాదంపై మోదీ ప్రధానంగా అంటోనీతో చర్చించినట్టు భావిస్తున్నారు. భారత్లో ఆంటోనీ పర్యటనను ఆస్ట్రేలియాలోని జర్నలిస్టులు, మేధావులు తప్పుబడుతున్నారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టి అసహనాన్ని ప్రోత్సహిస్తున్న మోదీని ఆంటోనీ కలవడం సరికాదంటూ ‘ది ఆస్ట్రేలియన్’ పత్రికలో ప్రముఖ జర్నలిస్ట్ గిడెన్ హెయ్ విమర్శించారు.
ఆస్ట్రేలియాలో మిత్రుడి కంపెనీలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎలాగైనా ఆదుకోవాలి. అక్కడి పీఎంను ఏదో సాకుతో ఇక్కడికి రప్పించి.. కూలంకషంగా మాట్లాడాలి. ఇదే సమయంలో ‘75 ఇయర్స్ క్రికెట్ ఫ్రెండ్షిప్’ గుర్తొచ్చింది. అంతే, నిమిషాల్లో ఆస్ట్రేలియా పీఎం ఆంటోనీకి మోదీ కబురుపెట్టారు. స్వరాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్లో తన పేరిట పునర్నిర్మించిన స్టేడియాన్ని వేదికగా చేసుకొన్నారు. అయితే, స్టేడియంలో జనం లేకపోతే తనకు పరువు తక్కువ. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులను రంగంలోకి దింపారు. స్టేడియంలోని మొత్తం 1,30,000 టికెట్లలో 80,000 టికెట్లను వాళ్లతోనే కొనిపించి.. పబ్లిక్కు ఫ్రీగా పంపిణీ చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు 12 వేల టికెట్లను టార్గెట్గా పెట్టారు. అలా జనాన్ని సమీకరించి.. క్రికెట్ మ్యాచ్ను రాజకీయ సభగా మార్చివేశారు.