హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర నాందేడ్ సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ‘విద్యుత్తు ప్రైవేటీకరణ’పై వ్యతిరేక గళాన్ని గట్టిగా వినిపించడం పట్ల ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్), తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్లు (టీఎస్పీఈఏ) స్వాగతించాయి. విద్యుత్తు ప్రైవేటీకరణ, బొగ్గు దిగుమతి తదితర అంశాలపై జాతీయస్థాయిలో మాట్లాడటం పట్ల హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆదివారం నాందేడ్ వెళ్లిన సంఘాల నేతలు సీఎం కేసీఆర్ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో మొదటిసారిగా విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ తీర్మానించారని గుర్తుచేశారు.
కేసీఆర్ వ్యాఖ్యలను మహారాష్ట్ర ఇంజినీర్లతోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగులు హర్షిస్తున్నారని ఏఐపీఈఎఫ్ సెక్రటరీ జనరల్ పీ రత్నాకర్రావు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రకాల వినియోగదారులకు 24 గంటలపాటు విద్యుత్తును అందిస్తున్నారని, ఇది కేసీఆర్ ప్రభుత్వానికే సాధ్యమైందని కొనియాడారు. సీఎం కలిసిన వారిలో సంఘాల నేతలు సదానందం, వెంకటనారాయణరెడ్డి, జనప్రియ, పీవీ రావు, గోపాల్రావు, గోపాలకృష్ణ, బాగయ్య తదితరులు ఉన్నారు.