Rain Alert | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలకు తోడుగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు వాతావరణం కాస్త చల్లబడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
హైదరాబాద్లో తేలిక పాటి వర్షాలుంటాయని వెల్లడించింది. ఉత్తర ఒడిశా, దక్షిణ ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీసగఢ్ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతున్నదని తెలిపింది. జూన్ మొదటి వారంలోనే రావాల్సిన వానలు.. ఈసారి కాస్త ఆలస్యంగా వచ్చాయి. ఎట్టకేలకు వాన రాకతో రైతులు పొలం పనుల్లో బిజీబిజీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.