యాదాద్రి భువనగిరి, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం చెంత భక్తుల సౌకర్యార్థం రూ.6.90 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక హంగులతో మాడల్ బస్టాండ్ను నిర్మించింది. ఇతర జిల్లాలతోపాటు ఇతర రాష్ర్టాల బస్సులను నిలిపేలా సుమారు ఐదు ఎకరాల్లో ప్రయాణికుల ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. మొత్తం 10 ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేయడంతో ఏకకాలంలో 10 బస్సులు నిలిపే అవకాశం ఉంది. బస్టాండ్ ముందు, వెనుక సుమారు వంద బస్సులను నిలిపేలా, ప్రయాణికులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. టెండర్ తర్వాత ఫుడ్కోర్టు, ఏసీ రూమ్లు, వెయిటింగ్ హాల్, క్లాక్ రూమ్లు, స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ బస్టాండ్.. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, అన్నదాన సత్రానికి దగ్గరగా ఉన్నది. ఈ బస్టాండ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భక్తులు ఇక్కడి నుంచే మినీ బస్సుల్లో కొండపైకి వెళ్లవచ్చు. దీంతో భక్తుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఈ మాడల్ బస్టాండ్ను రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ బస్ భవన్ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు నూతన బస్టాండ్ను, ఏర్పాట్లను పరిశీలించారు.