హైదరాబాద్ : అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన ఎండీ మౌజం అలీఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ అటవీ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మౌజం అలీఖాన్ను బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన స్వస్థలం కామారెడ్డి జిల్లా కేంద్రం. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 1.40లక్షల మంది సభ్యులున్న అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్యకు మౌజం అలీఖాన్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిలపభారత అటవీ అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి హోదాలో తెలంగాణ రాష్ట్రఖ్యాతిని దేశ వ్యాప్తంగా చాటిచెబుతానన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని, హరితహారం నినాదాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తామన్నారు. హరిత నిధి అంశం చారిత్రాత్మకమైందని, అడవులను అభివృద్ధి చేసే కార్యక్రమం రాష్ట్రంలో జోరుగా సాగుతోందని అన్నారు. దేశవ్యాప్త అటవీ అధికారులు, ఉద్యోగుల ప్రమోషన్లు, సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతామని మౌజం అలీఖాన్ పేర్కొన్నారు.