ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 29: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎస్సీ వర్గీకరణ విషయమై మౌనం వీడాలని ఎమ్మార్పీఎస్ (టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై తన అభిప్రాయాన్ని తెలపాలని, లేకుంటే దళితుల గురించి మాట్లాడే నైతికతే లేదని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్హౌజ్ ఐసీఎస్ఎస్ఆర్ మినీ కాన్ఫరెన్స్ హాలులో శనివారం ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం సంఘం జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీల్లోని అన్ని కులాలకు దళితబంధు పథకాన్ని అమలు చేయాలని కోరారు. భూమి, ఇండ్లు లేని వారికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ప్రతీ నియోజకవర్గంలో 15 వేల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎవరూ చేయని సాహసంతో దళితబంధును అమలు చేస్తున్నారని కొనియాడారు. దీనిని అవహేళన చేస్తూ మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి దళితులు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం కోర్ కమిటీ సభ్యులు కోండ్ర శంకర్, గుర్రాల శ్రీనివాస్, బల్గర్ హుస్సేన్, రేగుంట నాంపల్లి, పొట్టపెంజర రమేశ్, చింత బాబు, మంచాల యాదగిరి, బాబురావు, రుక్కమ్మ, లక్ష్మి, మోహన్, యాదగిరి, సంజీవ, శ్రీను, కృష్ణ, నరసింహ, శివరాజ్, కుమార్, సాగర్, విద్యార్థి నేతలు కొల్లూరు వెంకట్, వరిగడ్డి చందు తదితరులు పాల్గొన్నారు.