కోదాడటౌన్, ఫిబ్రవరి 14: ఎస్సీ వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం మాదిగల శత్రువని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల అత్యవసర జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో సంపూర్ణ మెజార్టీతో అధికారం కలిగి ఉండి ఎన్నో బిల్లులను, రాజ్యాంగ సవరణలను పార్లమెంట్లో ఆమోదించుకుంటున్న బీజేపీ.. ఒక్క ఎస్సీ వర్గీకరణ పట్ల మాత్రమే నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. 29 ఏండ్లుగా ఎమ్మార్పీఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపి, అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా బీజేపీ నమ్మకద్రోహనికి పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణలో మాదిగల జనాభా అత్యధికంగా ఉన్నదని, మాదిగలకు నమ్మక ద్రోహం చేసి బీజేపీ తెలంగాణలో ఎట్లా అధికారంలోకి వస్తుందో చూస్తామని హెచ్చరించారు.