జీడికల్ (జనగామ) : లింగాలఘణపురం మండలం జీడికల్ వీరాచల జీడికంటి సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యతో కలిసి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.4కోట్ల వ్యయంతో ఆర్చిగేట్, ఆలయ ప్రధాన రహదారి పనులకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ఎమ్మెల్సీకి దేవస్థాన అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
అనంతరం వీరాచల సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఎంతో మహిమాన్వితమైందని, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. గత మే 9న ఎమ్మెల్యే కోరిక మేరకు జీడిపల్లి దేవాలయానికి వచ్చానని, ఈ సందర్భంగా ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చుకున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ వచ్చాక దేవాలయాలకు పూర్వవైభవం తీసుకువస్తున్నారన్నారు. దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను సైతం అభివృద్ధి చేస్తున్నారని, పూజారులను ఆదుకున్నారన్నారు. యాదగిరిగుట్ట వైభవోపేతంగా రూపుదిద్దుకున్నదన్నారు. ఇదే క్రమంలో జీడికల్ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేరస్తానన్నారు. దేవాలయ భూములపై సర్వే చేపట్టామని, అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ను సైతం రూపొందించామన్నారు.
అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేలా చూడడంతో పాటు జాతర నిర్వహించేలా కృషి చేస్తానన్నారు. 44 ఎకరాల్లో దేవాలయం, కల్యాణ మండపం, పార్కు, పార్కింగ్ ప్రదేశాలు, షాపింగ్ కాంప్లెక్స్ కోసం మాస్టర్ ప్లాన్ను రూపకల్పన చేశామని, మూడేళ్లలో పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. దశలవారీగా నిధులు సమకూర్చి రూ.50కోట్లతో పూర్తిస్థాయి అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో లింగాల ఘనపూర్ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.