హైదరాబాద్ : బాలికపై లైంగికదాడి కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదని శాసన మండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతిరోజూ దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నానని చెప్పే కేంద్రమంత్రి, తన కుమారుడు అఘాయిత్యం చేస్తే ఏమీ జరగలేదని వెనకేసుకురావడం దారుణమన్నారు. పైగా ఇంత జరిగాక కూడా ఆయన ఏమీ ఎరుగనట్లు ప్రధాని సభలో పాల్గొనడం సిగ్గుచేటన్నారు.
‘బేటీ బచావో’ అంటూ నినాదాలిస్తూ నీతి వాక్యాలు పలికే బీజేపీ నేతలు, తమ కేంద్రమంత్రి ఒక మైనర్ ఆడపిల్ల పట్ల చేస్తున్న కుట్రలను ఖండించాలన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్ర హోం శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కుమ్మక్కై ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ రవీందర్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఒక బాలికకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తాయని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి ప్రశ్నించారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని, ఈ ఘటనపై న్యాయం కోసం ఉద్యమించి, దేశవ్యాప్తంగా అన్నిపక్షాల మద్దతు కూడగడుతుందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు హెచ్చరించారు.