హైదరాబాద్ : చేనేత రంగంలో ఏకీకృత టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ( Revanth Reddy ) మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ ( MLC L Ramana ) లేఖ రాశారు. పాత విధానంలోనే టీఎస్సీవో ( TSCO ) ద్వారా దుస్తులు కొనుగోలు చేయాలని కోరారు. మార్చి 11 న ఇచ్చిన జీవోను యథాతథంగా అమలు చేయాలని , విద్యార్థుల యూనిఫామ్ తయారీ కి సంబంధించిన 105 కోట్ల రూపాయల ఆర్డర్ను టీఎస్సీవోకు ఇవ్వాలన్నారు.
వివిధ సంక్షేమ శాఖలకు అవసరమయ్యే దుస్తులను టీఎస్సీవో ద్వారానే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగం ( Handloom Sector
) అనేది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాకుండా, వేలాది కుటుంబాల జీవనాధారమని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక అని వెల్లడించారు. ఈ రంగాన్ని కాపాడేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చేనేత కళాకారులకు, కార్మికులకు ఎంతో మేలు చేశాయని గుర్తు చేశారు.
గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ సంస్థలకు చేనేత వృత్తికి సంబంధించిన ఏ వస్తువు అవసరమైనా, రాష్ట్ర చేనేత సహకార సంస్థ ద్వారా చేనేత సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసే విధానం అమల్లో ఉండేదని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల నేతన్నలకు సంవత్సరం పొడవునా నిరంతర ఉపాధి లభించిందన్నారు. ఈ సమస్య పరిష్కరానికి వెంటనే చర్యలు తీసుకుని లక్షలాది నేతన్నల జీవనోపాధిని కాపాడాలని కోరారు.