MMTS | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): యాదాద్రి వరకు నడుస్తున్న లోకల్ ట్రైన్ను జనగామ వరకు పొడిగించాలని, ఎంఎంటీఎస్ రైలును మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సోమవారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి లేఖ రాశారు. ఈ నెలలో రాష్ట్రంలో పర్యటించనున్న మోదీకి విషయం చెప్పి, ఒప్పించాలని లేఖలో సూచించారు. ఎంఎంటీఎస్, లోకల్ ట్రైన్ వేస్తే రైల్వేకు లాభం ఉంటుందని, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.
హైదరాబాద్కు దగ్గరలో ఉన్న జిల్లా కేంద్రాల్లో జనగామ ఒకటని, ఇక్కడి నుంచి నిత్యం వేలాది మంది హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తారని వివరించారు. ఈ మార్గంలో నడుస్తున్న అతికొద్ది రైళ్లల్లో కికిరిసి, రైలు డబ్బాలకు వేలాడుతూ ప్రమాదకర ప్రయాణాలు చేయాల్సిన దీనస్థితి నెలకొన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో కొద్దిరోజుల్లోనే జనగామ అటు కాజీపేటతో, ఇటు హైదరాబాద్తో కలుస్తుందని చెప్పారు. ముందుగా జనగామ వరకు, తర్వాత వరంగల్ వరకు దశలవారీగా విస్తరించేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు.