ములుగు: ములుగు (Mulugu) బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (MLC Pochampally Srinivas Reddy) అన్నారు. ప్రజలు నాగజ్యోతికి (Bade Nagajyothi) బ్రహ్మరథం పడుతున్నారని, ఆమెకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఓర్వలేకపోతున్నారని చెప్పారు. ఓటమి భయంతో కాంగ్రెస్ (Congress) నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ములుగులో మాజీ ఎంపీ సీతారాం నాయక్తో కలిసి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి స్థానంలో కాంగ్రెస్ను ఓడగొట్టడమే తమ లక్ష్యమని చెప్పారు. సీతక్కవ వద్ద రేవంత్రెడ్డి ఇచ్చిన రూ.50 కోట్లు, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చిన వందల కోట్లు సిద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికే రూ.50 కోట్లు ములుగుకు వచ్చాయని చెప్పారు.
సీతక్క తమ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు. సీతక్క ఆరోపణలపై ఎన్నికల కమిషన్, ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. గత 10 ఏండ్లలో ములుగును ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. ములుగు జిల్లా చేశాం, మెడికల్ కాలేజీ తీసుకొచ్చామన్నారు. కొత్తగా మల్లంపల్లి మండలం, ఏటూరునాగారం డివిజన్ ఏర్పాటు చేశామని చెప్పారు. తాము చేసిన పని చెప్పి ఓట్లు అడుగుతున్నామని స్పష్టం చేశారు. కోవర్టు రాజకీయాలను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని తేల్చిచెప్పారు.