గజ్వేల్, మే 5: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించేది రైతు సంఘర్షణ సభ కాదని.. అది రాహుల్, కాంగ్రెస్ పార్టీ ఆత్మ సంఘర్షణ సభ అని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లాలోని ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శుక్రవారం వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రాహుల్గాంధీ సభపై స్పందించారు. కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు అమలు చేస్తారా? అని సవాల్ విసిరారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ తరహా పథకాలు అమలు చేస్తామని హామీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీని వరంగల్కు తీసుకొచ్చి రైతు సంఘర్షణ పేరిట తెలంగాణ రైతులకు సంబంధించిన డిమాండ్లను ప్రకటిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇచ్చే స్క్రిప్ట్ చదివే ముందు.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో ఇక్కడి రైతులను అడిగి తెలుసుకొని మాట్లాడాలని రాహుల్కు సూచించారు. కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యలు ఎన్ని జరిగాయో.. ఇప్పటి పరిస్థితులేంటో తెలుసుకోవాలన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం.. తెలంగాణలో 404 ఆత్మహత్యలు మాత్రమే జరిగాయని, కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా ఆత్మహత్యలే ఉండేవన్నారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇక్కడ లేదని చెప్పారు. 2014లో ఎఫ్సీఐ 24 లక్షల టన్నుల వడ్లు జోకితే, ఇప్పుడు కోటి 40 లక్షల టన్నుల వడ్లు కాంటా నిర్వహిస్తున్నామన్నారు. ఇది కాదా అభివృద్ధి అంటే అని ఆయన ప్రశ్నించారు. గతంలో పంజాబ్లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. కానీ, ఇక్కడ ఏం చేస్తారని పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. నీవు తెలంగాణ వచ్చే ముందు.. తెలంగాణలోని పథకాలు దేశవ్యాప్త అమలుకు పోరాటం చేయాలని రాహుల్గాంధీకి పల్లా సూచించారు. ఆయన వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఉన్నారు.