హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నిర్వహించిన ధర్నాలపై రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో భవన్లో వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు కోసం నిన్నటి వరకు 3,550 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచామని తెలిపారు. అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లపై కనీస అవగాహన లేకుండా బీజేపీ ధర్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ధాన్యం సేకరించిన వెంటనే, జాప్యం లేకుండా రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
బీజేపీ నాయకులు సోయి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కనీసం జ్ఞానం లేని వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం దురదృష్టకరమన్నారు. ఇతర రాష్ట్రాల్లో రైతులే మార్కెట్ల వద్దకు ధాన్యం తరలిస్తుంటే.. తెలంగాణలో మాత్రం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే యాసంగిలో వరిని కొంటామని కేంద్రం నుంచి బండి సంజయ్ లేఖ ఇప్పించాలి. బీజేపీ రాజకీయ ప్రస్థానమే అబద్ధాలతో కూడుకున్నది అని కోపోద్రిక్తులయ్యారు. రేపు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నాలు చేస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.