హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో, హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని శాసనమండలి విప్ పాడి కౌశిక్రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ను వీడి తప్పు చేసినందుకు ఈటల ప్రతిరోజూ బాత్రూంలో ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈటల కాంగ్రెస్లోకి వెళ్తారో.. బీఆర్ఎస్లోకి వస్తారో తెలియదని చెప్పారు. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్కు ఈటల ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిపై హుజూరాబాద్ అంబేద్కర్ సెంటర్లో చర్చించడానికి తాను వస్తానని, ఈటలకు దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. ఈటల సొంత గ్రామం కమలాపూర్లో ఏ వర్గానికి, ప్రత్యేకించి ముదిరాజ్లకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుడినని అని చెప్పుకునే రాజేందర్ స్థానిక ఎమ్మెల్యేగా హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. హుజూరాబాద్లోని 18 వేలకుపైగా ఉన్న దళిత కుటుంబాలకు రూ.1,800 కోట్లతో దళితబంధు పథకాన్ని అమలు చేశామని వివరించారు.
హుజూరాబాద్లో ఓడిపోతాననే భయంతోనే ఈటల రాజేందర్ మానసిక ఒత్తిడికి గురై బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కౌశిక్రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఈటల, ఎంపీగా బండి సంజయ్.. హుజూరాబాద్ నియోజకవర్గంలో తట్టెడు మన్నైనా తీశారా? అని ప్రశ్నించారు. మంత్రిగా గంగుల కమలాకర్ కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని, ఈటలకు మంత్రి పదవి వచ్చినా ఏమీ చేయలేకపోయారని చెప్పారు. సానుభూతి రాజకీయాలతోనే ఈటల పబ్బం గడుపుకున్నారని, అసహనంతో సైకోలా మారారని, వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు. ఈటల కన్నా తన తండ్రి సాయినాథ్రెడ్డి సీనియర్ ఉద్యమకారుడు అని, హుజూరాబాద్లోని తన ఇంట్లోనే టీఆర్ఎస్ జెండా పుట్టిందని పేర్కొన్నారు. ఈటల పెట్టిన ఇబ్బందుల వల్లే తన తండ్రి బీఆర్ఎస్కు దూరమయ్యారని, ఈటల పార్టీని వీడగానే తాము తిరిగి తమ సొంత గూటికి వచ్చామని వివరించారు.
తాను ముదిరాజ్లను దూషించానంటూ అసత్యప్రచారం చేస్తున్నారని, దానిని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని కౌశిక్రెడ్డి స్పష్టంచేశారు. కొంతమంది బ్రోకర్లను పెట్టుకొని ఈటల దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తాను ఓ యూట్యూబ్ చానెల్ కెమెరామెన్పై చేయి చేసుకున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ కెమెరామెన్ తన ఇంటికి వచ్చి, తనతోపాటు కూర్చొని భోజనం చేసి వెళ్లారని, ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియో ఫుటేజ్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. తాను ఎవ్వరినీ కులం పేరుతో దూషించలేదని చెప్పారు.