MLC Kaushik Reddy | హుజూరాబాద్ టౌన్, జూన్ 12: ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు బైక్ను తప్పించబోయి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కౌశిక్రెడ్డికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. సోమవారం ఉదయం హుజూరాబాద్లో 2కే రన్లో పాల్గొనేందుకు కరీంనగర్ నుంచి వెళ్తుండగా మానకొండూర్ మండలం ఖాదర్గూడెం సమీపంలోకి రాగానే బైక్ను తప్పించబోయి కౌశిక్రెడ్డి కారు పొలాల్లోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. వెంటనే ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. బైక్పై ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా దవాఖానకు తరలించారు.
ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి వేరే వాహనంలో హుజూరాబాద్ 2కే రన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కౌశిక్రెడ్డికి హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో వైద్యులు ఈసీజీ, సానింగ్, ల్యాబ్ టెస్టులు, ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. గంట సేపు దవాఖానలో ఉంచుకొని అనంతరం ఇంటికి పంపారు. వాహనం బోల్తా పడటంతో శరీరంలో అవయవాలు కుదుపునకు గురైనందున ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డ్యూటీ వైద్యులు ప్రసాద్, శ్రీకాంత్రెడ్డి సూచించారు. కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం తన కారు ప్రమాదానికి గురైందని, కారులో తనతోపాటు పీఏ, ఇద్దరు గన్మెన్లు, డ్రైవర్ ఉన్నారని పేర్కొన్నారు. డ్రైవర్ చాకచక్యంతో ఈ ప్రమాదం నుంచి అందరం సురక్షితంగా బయటపడ్డామని, ఎవరూ ఆందోళన చెందవద్దని నియోజకవర్గ ప్రజలకు తెలిపారు.