హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సామాజిక వర్గీయులకు రాష్ట్ర ప్రభుత్వం అం డగా నిలుస్తుందని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఎన్నో ఏండ్ల నుంచి వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆదివారం ఉప్పల్ భగాయత్లో నిర్వహించిన విశ్వ బ్రాహ్మణ-విశ్వకర్మల ఆత్మగౌరవ సభలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా విశ్వకర్మలు, విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగా మిగలడంతో ఆకలి చావులు, ఆత్మహత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘విశ్వకర్మ బంధు’ పథకం కోసం కృషి చేస్తానని చెప్పారు. విశ్వకర్మల హక్కుల సాధన కోసం అండగా నిలుస్తానని జూలూరు గౌరీశంకర్ తెలిపారు.
ఈ సభలో డాక్టర్ లాలుకోట వెంకటాచారి, డాక్టర్ వేములవాడ మదన్మోహన్, చొల్లేటి కృష్ణమాచార్యులు, రాళ్లబండి విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో బీసీ కమిషన్ సభ్యుడు చిట్టోజు ఉపేంద్రాచారి, తల్లోజు ఆచారి, డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి, సుంకోజి కృష్ణమాచారి, పులిగిళ్ల శ్రీనివాసాచారి, రామడుగు నరసింహాచార్యస్వామి, తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి బైరోజు వెంకటరమణాచారి, దానకర్ణాచారి, కుందారపు గణేశ్చారి తదితరులు పాల్గొన్నారు.