న్యూఢిల్లీ: ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారని చెప్పారు. రెండేండ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని విమర్శించారు. వాళ్లకు కొత్తగా అడిగేందుకు ఏం లేదని తెలిపారు. సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కవితన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు.
కాగా, ఈ నెల 23 వరకు న్యాయస్థానం కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు. అయితే 14 రోజులపాటు కస్టడీ విధించాలని సీబీఐ కోరగా, 9 రోజుల కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను గత నెల 16న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.