భువనగిరి: భువనగిరిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పరిశీలించారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి బలవన్మరణానికి గల కారణాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. అధికారులను అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైరంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పట్టికీ విద్యార్థినుల మృతికి గల కారణాలను పోలీసులు తెలుసుకోలేక పోవడం దారుణమన్నారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం హృదయవిధారకంగా ఉందని చెప్పారు. వారి సూసైడ్ లెటర్ పలు అనుమానాలకు తావిస్తున్నదని వెల్లడించారు. హాస్టల్ పరిసరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితులను గుర్తించాలన్నారు. హాస్టల్కు తరచూ బయటి వ్యక్తులు వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.