హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం హైదర్గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో స్పీకర్ను కలిసి ఎమ్మెల్సీ కవిత వినతిపత్రం అందజేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేసి అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుకున్నామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో పూలే విగ్రహం కోసం ఉద్యమిస్తామని చెప్పారు.
ఏప్రిల్ 11న పూలే జయంతి లోపు స్పీకర్, ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్ 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల మద్దతుతో వివిధ కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించారు. ప్రతి గ్రామం నుంచి ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని తెలిపారు. స్థానికసంస్థల్లో బీసీలకు 42% ప్రాతినిధ్యం కల్పిస్తామన్న హామీతోపాటు బీసీ జనగణన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని కోరారు. బతుకమ్మకు రాష్ట్ర పండుగ హోదా, అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించుకోవడంలో భారత జాగృతి కీలకపాత్ర పోషించిందని వివరించారు.
అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావ్ పూలే విగ్రహం ఏర్పాటు అంశంపై ఈ నెల 26న హైదరాబాద్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. సమావేశంలో పాల్గొనాల్సిందిగా పలువురు ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, మేధావులు, బీసీ సంఘాల నేతలను స్వయంగా ఆహ్వానించారు. అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించనున్నారు.