చిక్కడపల్లి, డిసెంబర్ 11 : ఎస్సీ వర్గీకరణ కోసం అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 13న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ వెల్లడించారు. శనివారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాదిగలది న్యాయమైన డిమాండ్ అని సీఎం కేసీఆర్ తమకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. తమ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశామని, దళితుల పట్ల బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని మండిపడ్డారు. వర్గీకరణ విషయంలో తాడోపేడో తేల్చుకొనేందుకే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మాదిగలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి, మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13, 14న మాదిగ జేఏసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్సీ కవిత శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్, టీఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల మల్లికార్జున్, మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు జెర్రిపోతుల సాయన్న తదితరులు పాల్గొన్నారు.