Kavitha | నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం యూకేకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సెండాఫ్ ఇచ్చారు. ప్రపంచంలోనే ప్రముఖమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ మోడల్పై ప్రసంగించనున్నారు. ఈ నెల 30న జరుగనున్న కార్యక్రమంలో ‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్ : ద తెలంగాణ మోడల్’ ఉపన్యాసం చేయాలని ఆక్స్ఫర్డ్ ఆహ్వానించింది. అంతర్జాతీయ వేదికపై సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిని అవిష్కరించే అవకాశం లభించినందుకు కార్యకర్తలు కవితకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందడం, అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ఘనతను చాటిచెప్పడం తెలంగాణకు గర్వకారణమని కొనియాడారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల పథకాల రూపకల్పనపై అంతర్జాతీయ వేదికపై కవిత వివరించనున్నారు. గత పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ఆకర్షించాయి. తెలంగాణలో వ్యవసాయం, విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ తదితర అంశాలపై కవిత ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతులకు రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్ తదితర అంశాలపై కవిత ప్రసంగిస్తారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కులవృత్తులను ప్రోత్సహించడమే కాకుండా.. రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే మిగులు విద్యుత్తుకు చేరుకోవడానికి సీఎం కేసీఆర్ చేసిన కృషితో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీ, విద్యా వైద్యరంగంపై సైతం ప్రసంగించనున్నారు. హైదరాబాద్ పట్టణ అభివృద్ధి, భద్రత, మౌలిక సదుపాయాలపై సైతం ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.