హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10న చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ‘2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు?’ అనే అంశంపై జరిగే చర్చ వేదికలో పాల్గొననున్నారు. ఈ చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవితతో పాటు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు ఎమ్మెల్యే వాసంతి శ్రీనివాసన్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ సైతం హాజరుకానున్నారు.
బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలను ఈ వేదిక ద్వారా కల్వకుంట్ల కవిత చాటిచెప్పనున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, రైతుబీమా తదితర పథకాల గురించి వివరించనున్నారు. సోమవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్తో సామాజికంగా జరిగే లాభాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై చూపించే సానుకూల ప్రభావంపై వివరించనున్నారు. అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు.