హైదరాబాద్: చట్టసభల్లో బీసీ మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు కులగణన చేపట్టాలన్న డిమాండ్తో ఈ నెల 26న జల విహార్లో బీసీ సంఘాలు నిర్వహించ తలపెట్టిన సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ కవితతో సమావేశమై బీసీ అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. బీసీలు ఆర్థికంగా బలపడాలన్న ఆలోచనతో బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
కుల వృత్తులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా రాయితీలు ప్రోత్సాహకాలను అందిస్తూ వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుందని కవిత పేర్కొన్నారు. బీసీ వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాల వారిని కూడా ప్రభుత్వం విస్మరించడం లేదని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో అత్యంత వెనుకబడిన కులాల వారికి కేసీఆర్ అవకాశాలు కల్పించి చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లుపై తీర్మానం చేశామని గుర్తు చేశారు. బీసీల పట్ల తమ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నదని, బీసీలకు రావాల్సిన వాటా, హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమానికి తమ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. జీవితాంతం బీసీల కోసం పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యను ఆమె అభినందించారు.
బీసీ ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం: ఆర్ కృష్ణయ్య
బీసీ ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం పూరిస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. తాము చేపట్టే ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సంపూర్ణ సహకారం, మద్దతును ప్రకటించారని తెలిపారు. దశాబ్దాలుగా ఎదురు చూసిన మహిళా బిల్లు కోసం కవిత చేసిన పోరాటం ఫలించిందని, అందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని కవితపై కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు.