హైదరాబాద్ : భూపాలపల్లి సింగరేణి గనిలో నిన్న ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికులకు అండగా నిలుస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురు కార్మికులు చింతల రామకృష్ణ, బండి రాజశేఖర్, ఎర్రవెల్లి శ్రీనివాస్లను హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఈ రోజు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కార్మికులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. గురువారం ఉదయం భూపాలపల్లి 8వ గనిలో బ్లాస్టింగ్ చేస్తున్న సమయంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డ సంగతి తెలిసిందే.