ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 19: మూడు దశాబ్దాల నుంచి పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని పోరాటం చేశారని, దాని ఫలితంగానే పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి అన్నారు. ఈ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పారు. మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ సర్కారు చొరవ కారణంగానే బిల్లుకు మోక్షం లభించిందని అభిప్రాయపడ్డారు. బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే ఆకాశంలో సగం, భూమిలో సగం, అధికారంలో సగం అనే నినాదం అమలుకానుందన్నారు.
2014లో రాష్ట్ర అసెంబ్లీలో..
మహేశ్వరం: ఎమ్మెల్సీ కవిత చేసిన దీక్షలతోనే కేంద్రం దిగివచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిందని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి అన్నారు. 2014 లోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.
ఇది బీఆర్ఎస్ ఘనతే : తుంగ బాలు
ఉస్మానియా యూనివర్సిటీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి, పార్లమెంట్లో ప్రవేశపెట్టడం బీఆర్ఎస్ ఘనతేనని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతుందని గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే..
కంటోన్మెంట్: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో ఎమ్మెల్సీ కవితను నగరంలోని ఆమె నివాసంలో కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్ఞాని లాస్యనందిత మర్యాదపూర్వకంగా కలిసి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఉక్కు మహిళ ఎమ్మెల్సీ కవిత..
మల్కాజిగిరి: చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకురావడానికి ఉక్కు మహిళా ఎమ్మెల్సీ కవిత పోరాటం చేశారని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితను మంగళవారం కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అభినందనలు తెలిపారు.మహిళా బిల్లుపై మేయర్ హర్షం..!
సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా పెండింగ్లో ఉన్న బిల్లును ప్రవేశపెట్టడం సంతోషంగా ఉన్నదని మేయర్ అన్నారు. ఈ బిల్లుతో మహిళలు కూడా రాజకీయ రంగంలో ముందు ఉంటారని, దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషిస్తారని పేర్కొన్నారు. మహిళా బిల్లు కేబినెట్లో ఆమోదం పొందడం దేశానికే గర్వకారణమని తెలిపారు. ఈ బిల్లును నారీశక్తి అని నామకరణం చేయడం సంతోషమని, మహిళలందరీ తరఫున మేయర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడంలో ఎమ్మెల్సీ కవిత కృషి ఎంతో ఉన్నదని, మహిళల తరఫున కవితకు మేయర్ ధన్యవాదాలు తెలిపారు.