హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకరించకపోయినా.. ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో కవిత పాల్గొని మాట్లాడారు.
‘దేశంలో మన రాష్ట్రం సాధించిన ప్రగతిని గవర్నర్ తన ప్రసంగంలో కూలంకుశంగా చాలా అద్భుతంగా చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇంత అభివృద్ధి సాధించిందంటే మానవతా దృక్పథం, దార్శనికత, రాజనీతజ్ఞత, కార్యదీక్ష కలిగిన నాయకుడు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి నాయకుడు సీఎం కేసీఆర్. ఎన్ని ఎదురుగాలులు వీచినా.. కేంద్ర ప్రభుత్వం సహకారం అందించకపోయినా, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అడుగడుగునా అడ్డుపడినా కూడా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడం ప్రజలందరికీ గర్వకారణం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ కార్యక్రమం, పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఉత్తేజాన్నిస్తున్న విధంగా ఉన్నాయి. దాదాపు 17-18 రాష్ట్రాలు తెలంగాణకు వచ్చి అనేక కార్యక్రమాలను అధ్యయనం చేశాయి. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ సభకు హాజరైన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అర్వింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ మన దగ్గర అమలు చేస్తున్న కంటి వెలుగు పథకంతో స్ఫూర్తి పొంది వెంటనే వారి రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని ప్రకటించడం మన రాష్ట్రానికి, సీఎం కేసీఆర్కు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’ అని కవిత తెలిపారు.
ఏ రాష్ట్రమైనా ప్రగతి సాధించిందని తెలియాలంటే ఆ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎంత పెరిగిందన్నది కొలమానం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,24,104 ఉండేదని, 2022 నాటికి అది రూ. 3,17,118కు పెరిగిందని వివరించారు. పెద్ద ఎత్తున జీవన విధానం, జీవన శైలిలో మార్పులు వచ్చాయని అన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి కల్పన, పెన్షన్లు, పెట్టుబడులు, పరిశ్రమల వంటి రంగాలతో పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అడవుల పెంపకం, ఆలయాల అభివృద్ధి, దళిత వర్గాల అభివృద్ధి, మైనారిటీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి, అగ్రవర్ణాల పేదల సంక్షేమం.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా మన ప్రభుత్వం ఏ ఒక్కరినీ విస్మరించలేదని అన్నారు. ప్రతీ ఒక్కరి సమస్యను తన సమస్యలుగా భావించి ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. అందువల్లనే ఇంత అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు.
గతంలో లక్ష ప్రసవాలకు 92 మంది మరణించేవారని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల అవి 43కు తగ్గాయని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఆరోగ్య లక్ష్మి పథకం వల్ల రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది గర్భణిలకు లబ్ధి చేకూరినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఇప్పుడు శిశు మరణాలు కూడా తగ్గాయని చెప్పారు. పోషకాహారాన్ని అందించే అంగన్వాడీ, ఆశా వర్కర్ల వ్యవస్థను సీఎం కేసీఆర్ బలోపేతం చేశారన్నారు. ప్రత్యేకంగా 35,700 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయని, వాటిల్లో పనిచేసే వర్కర్ల వేతనం చాలా తక్కువగా ఉండేదని, దాన్ని సీఎం కేసీఆర్ రూ.13,650కు పెంచారని వివరించారు. అందులో కేంద్రం వాటా కేవలం రూ. 2,700 మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 10,950 ఉందని వెల్లడించారు. ఆశా వర్కర్ల వేతనం రూ. 2 వేలుగా ఉండేదని, దాన్ని రూ. 9,750 పెంచామని గర్తు చేశారు. ఇందులోనూ కేంద్రం వాటా కేవలం రూ. 1,200 మాత్రమేనని వివరించారు.
‘పిల్లల విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసింది. మన ఊరు మన బడి కింద రూ. 7 వేల కోట్లతోపాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనాన్ని రూ. 3 వేలకు ప్రభుత్వం పెంచింది. అందులో కేంద్రం వాటా కేవలం రూ. 600 మాత్రమే’ అని వివరించారు.
కేంద్రం సహకరించకున్నా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేసిందని కవిత వివరించారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్శించి రాష్ట్రంలో దాదాపు 30 లక్షలకుపైగా ఉద్యోగాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో దాదాపు 2 లక్షలకుపైగా ఉద్యోగాలను కల్పించినట్లు గుర్తు చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి వేతనాలు పెంచినట్లు చెప్పారు. ఆర్టీసీ, సింగరేణి, జెన్కో, ట్రాన్స్ కో వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు.
తమ గ్రామాలను కూడా తెలంగాణలో విలీనం చేయాలంటూ పొరుగు రాష్ట్రాలు, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి సర్పంచ్లు డిమాండ్ చేస్తుండడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని, దాని వెనుక సీఎం కేసీఆర్ శ్రమ తీవ్రంగా ఉందని తెలిపారు. ‘నాకు దేశం ఏం ఇచ్చిందన్న నిర్లప్తత గతంలో కొంత మందిలో ఉండేది. కానీ మన ముఖ్యమంత్రి వచ్చాక నాకు దేశం ఏం ఇచ్చిందన్నది కాకుండా దేశానికి నేనేం ఇస్తున్న అనే పంథాతో మనమంతా ఆలోచించి రాష్ట్రంలో సంపదను పెంచి దాన్ని దేశమంతటా పంచుకున్న సందర్భం ఇది’ అని వ్యాఖ్యానించారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని కౌన్సిల్ లోనూ ఏర్పాటు చేయాలని మండలి చైర్మన్కు కవిత విజ్ఞప్తి చేశారు. దానికి తక్షణమే స్పందించిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుకు అంగీకరించారు. ఇప్పటికే ఈ విషయమై సంబంధిత అధికారులకు దేశాలు జారీ చేశాసినట్లు తెలిపారు.