హైదరాబాద్: కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అవమానించడాన్ని ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఖండిచారు. ఇది కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సిగ్గుమాలిన వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది కేవలం కలెక్టర్ను అవమానించడమే కాదు.. మొత్తం అధికార యంత్రాంగాన్నే అవమానించినట్లని తెలిపారు. మహిళా కలెక్టర్కు తాము అండగా ఉంటామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా కలెక్టర్కు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కామన్సెన్స్ ఉండదా?
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్నపుడు ఏసీపీ కూడా అందుబాటులో లేడని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తంచేశారు. శుక్రవారం కరీంనగర్లో కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. కరీంనగర్లోని మల్టీపర్పస్ స్కూల్ వద్ద పార్క్, హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్లు, నిరంతర నీటి సరఫరాను కేంద్ర మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తోపులాట జరుగగా మంత్రి పొంగులేటి పక్కనుంచి నడుస్తున్న కలెక్టర్ పమేలా సత్పతిని చూసి ఒక్కసారిగా అసహనానికి గరయ్యారు. ‘వాట్ ఈజ్ దిస్, వాటర్ యూ డూయింగ్.. కొంచెమైనా కామన్ సెన్స్ ఉండదా.. ఎస్పీ ఎక్కడ’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో కలెక్టర్ నిశ్చేష్టురాలై పోయారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అసహనం వ్యక్తంచేశారు. మహిళ అని కూడా చూడకుండా కలెక్టర్పై అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. సభ ముగిసిన తర్వాత మంత్రులకు వీడ్కోలు పలికేందుకు వెళ్లినపుడు కూడా మంత్రులిద్దరూ కలెక్టర్ను పట్టించుకోకుండానే అక్కడి నుంచి వెళ్లి పోయారు.