బోధన్: బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మీయతకు మధ్య జరుగుతున్న ఎన్నికలని వ్యాఖ్యానించారు. ఎవరు కావాలో ఆలోచన చేసి ప్రజలు నిర్ణయించాలని కోరారు. రైతులకు రైతుబంధు ఇస్తుంటే బిచ్చం వేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని విమర్శించారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్తు ఎందుకు 3 గంటల చాలు అని రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. విద్యార్థి నాయకులను అడ్డమీది కూలీలని వ్యాఖ్యానించాడని, రేవంత్రెడ్డికి ఎంత అహంకారం ఉంటే ఇన్ని మాటలు మాట్లాడుతారని ఆమె ప్రశ్నించారు.
బోధన్ నియోజకవర్గం గౌడ ఆత్మీయ సమ్మేళన సభలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ను భారీ మెజారిటీతో మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గౌడ కులస్తులను విస్మరించారని, నిర్లక్ష్యం చేశారని, కల్లు అంటేనే నాటి ఆంధ్రా పాలకులు అవహేళన చేశారని, హైదరాబాద్లో కల్లు దుకాణాలను మూసివేయించారని ఆమె గుర్తుచేశారు. ఆంధ్రా పాలకులు అహంకారంతో ఇలా చేశారని, అప్పుడు మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి కూడా వత్తాసు పలికారని విమర్శించారు. గౌడల మేలు కోరే సీఎం కేసీఆర్.. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు దుకాణాలను పునరుద్ధరించారని చెప్పారు.
రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి, ముదిరాజుల పెద్దమ్మ తల్లి దేవాలయానికి కాంగ్రెస్ హయాంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని కవిత ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ దేవతల ఆలయాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ప్రతి కులవృత్తిని గౌరవించుకుంటేనే సమాజం బాగుటుందన్నది సీఎం కేసీఆర్ విశ్వాసమని అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా తాటి, ఈత చెట్లు నాటించారని తెలిపారు. జిల్లాకు 5 ఎకరాలను కేటాయిస్తూ జీవో జారీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. చెట్లపై పన్నును ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
కల్లు దుకాణాలను పునరుద్ధరించడం వల్ల నేరుగా70 వేల గౌడ కుటుంబాలకు ఉపాధి లభిస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గౌడ కులస్తుల ఆత్మ గౌరవాన్ని కాపాడారని చెప్పారు. సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని అన్నారు. బోధన్ ప్రాంతంలో అదనంగా తాటి, ఈత చెట్ల పెంపకానికి కూడా సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి బోధన్కు వచ్చి పోతారని, షకీల్ మాత్రం ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు.
షకీల్ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి అయినా దసరా వస్తే ఎంతో మంది హిందూ మహిళలకు చీరలను పంపిణీ చేస్తుంటారని, దీపావళి వస్తే ప్రతీ కుటుంబాన్ని పలకరిస్తారని, రంజాన్, క్రిస్మస్ పండగలనూ అంతే ఘనంగా నిర్వహిస్తారని కవిత కొనియాడారు. గంగా జమునా తెహజీబ్ ఇదేనని అన్నారు.
ప్రశాంతంగా ఉంటే సమాజం బాగుటుందని, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క మతకల్లోలం జరగలేదని చెప్పారు. మతసామరస్యం వల్లే దాదాపు 22 వేల కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయని, దాదాపు 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని అన్నారు.