హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ (Professor Jayashankar) నుంచి తాను అనేక అంశాలు నేర్చుకున్నాని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆయన తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని చెప్పారు. జయశంకర్ సార్ అందరికీ స్ఫూర్తి ప్రధాత.. అందరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారన్నారు. మేడ్చల్లోని కేఎల్ఆర్ వెంచర్లో మంత్రి మల్లారెడ్డితో కలిసి అమరవీరుల స్థూపం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆచార్య జయశంకర్ సార్ పుట్టినరోజున ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవహేళనలు ఎదురైనా ఎక్కడా అధైర్యపడలేదని చెప్పారు.
అంతకుముందు ట్విట్టర్ వేదికగా ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని చెప్పారు. స్వరాష్ట సాధన కోసం నిరంతరం పరితపించి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ, తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి అని తెలిపారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నానని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు.. స్వరాష్ట సాధన కోసం నిరంతరం పరితపించి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ , తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ… pic.twitter.com/NS5FFFTcfQ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 6, 2023