హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత్ జాగృతి (Bharat Jagruthi) తరఫున న్యాయపోరాటం చేయనున్నామని భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. దీనికోసం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీంకోర్టులో ఈ అంశంపై పెండింగ్లో ఉన్నపిటిషన్లో ఇంప్లీడ్ అవుతామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించిన తాము వాటిని తక్షణమే అమలు చేయించడానికి మరో పోరాటానికి సిద్ధమయ్యామని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని తక్షణ అమలుకోసం పలు రాజకీయ పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని గుర్తుచేశారు. ఇప్పటికే పలు పార్టీలు, సంస్థలు కోర్టుకు వెళ్లాయని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని, 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో భారత్ జాగృతి తరపున తాము కూడా న్యాయపరంగా ముందుకెళ్లే అంశంపై చర్చలు జరుపుతున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న పిటిషన్లో తాము ఇంప్లీడ్ అవుతామని కవిత ప్రకటించారు.