MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెడతామంటున్నదే తప్ప.. ప్రగతి గేర్లను మార్చడం లేదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. మండలి ఆవరణలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం నేమ్ ఛేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ ఛేంజింగ్ గవర్నమెంట్ కాదన్న విషయం బడ్జెట్ను చూస్తేనే అర్థమవుతుందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష చొప్పున అందించేదని, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, బడ్జెట్లో దానికి నిధులు కేటాయించకపోవడమే కాకుండా.. కనీసం ప్రస్తావించలేదని మండిపడ్డారు.
ఆశా వర్కర్ల జీతాలను రూ.18వేలకు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చినా బడ్జెట్లో ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధిని బడ్జెట్ ద్వారా నిరూపించుకోలేకపోయిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కేటాయింపులు చేయకుండా కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ పరిమితమైందన్నారు. మధ్యంతర బడ్జెట్లో ప్రజలు చాలా ఆశించారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు దారి చూపిస్తుందని భావించామని తెలిపారు. కానీ, మధ్యంతర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని స్పష్టం చేశారు. కేటాయింపులు ముఖ్యం కాదని, ప్రభుత్వ ధృక్పథం బడ్జెట్ను సూచిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని స్పష్టం చేశారు.
మైనారిటీ సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చాలా మాటలు మాట్లాడిందని, ఇమామ్లకు, మౌజమ్లకు రూ.10వేలు ఇస్తామని, పిల్లల కోసం తౌఫే తాలిమ్ను మొదలుపెడుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినా బడ్జెట్లో విస్మరించిందని విమర్శించారు. మైనారిటీ సంక్షేమానికి కేవలం రూ.2వేలకోట్లు మాత్రమే కేటాయించడమేంటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చెప్పిన సూక్ష్మస్థాయి హామీల అమలు ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందని తెలిపారు. పేర్లు, చిహ్నాలు మార్చడానికి ఇచ్చిన ప్రాధాన్యత హామీల అమలుకు కేటాయింపులు చేపట్టడానికి ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. కాగా, కేసీఆర్ హయాంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకపోయేదని.. కానీ, ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలోనే ప్రతి రోజూ 3-4 గంటల పాటు కరెంటు పోతుందని విమర్శించారు.