హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదానీ, మోదీ ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసులని ఆమె ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయమంటే కేంద్రానికి జంకు ఎందుకని ప్రశ్నించారు. హిండెన్బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే అదానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుంచి 22వ స్థానానికి పడిపోయారని ఆమె ఎద్దేవా చేశారు.
అదానీ సంస్థ అనేక ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూలు) నుంచి అప్పులు తీసుకుందన్నారు. అదానీ గ్రూప్లో ఎల్ఐసీ రూ. 80 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు. ఎస్బీఐ రూ. 27వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.5,380 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.7 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ సంస్థల షేర్లు 51 శాతం పడిపోగా, ఎల్ఐసీ రూ. 18 వేల కోట్లు నష్టపోయిందన్నారు. దీని ద్వారా ఎల్ఐసీ షేర్లు కొన్న, ఎల్ఐసీ పాలసీలు చేసిన చిరుద్యోగులు, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
అదానీ సంస్థల కారణంగా ఎల్ఐసీ లాంటి అనేక పీఎస్యూలు నష్టపోతున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కవిత ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిషరించడం, పార్లమెంటులో ప్రతిరోజూ నిరసన తెలుపుతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై గంటన్నర మాట్లాడిన ప్రధాని మోదీ, ఒకసారి కూడా అదానీ విషయం ఎందుకు ప్రస్తావించలేదని కవిత ప్రశ్నించారు. మోదీకి ప్రజలపై పట్టింపు లేదని, తన మిత్రులైన పారిశ్రామిక వేత్తల పైనే ఎకువ పట్టింపు ఉందనే విషయం ఆయన ప్రసంగంతో తేటతెల్లమైందని ఆమె మండిపడ్డారు. జాతీయవాదం ముసుగులో ప్రధాని దాక్కుంటున్నారని విమర్శించారు.
రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి కేంద్రం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిందని, ఏటా ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా నుంచి అకారణంగా 50 వేల మంది రైతులను, నిజామాబాద్ జిల్లా నుంచి 60 వేల రైతులను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించారని ఆమె వివరించారు. అదానీ వ్యవహారంపై జేపీసీతో విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.