వరంగల్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కమాన్చౌరస్తా: రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన మేరకు ఆరు నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఆగమాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీ హకుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా మంగళవారం వరంగల్, కరీంనగర్లో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించాలని, బీసీ సబ్ప్లాన్కి చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వా యి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఏప్రిల్ 11లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలోని జనాభాకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు ఇచ్చుకునే సౌలభ్యం కల్పించాలని కేసీఆర్ ప్రతిపాదించారని, కేంద్రం మాత్రం ఆ అవకాశాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటివరకు 4,365 మంది సివిల్స్కు ఎంపికయ్యారని, వీరిలో 1,195 మంది మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని పేర్కొన్నారు. ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఉన్నా ఈ వర్గాల నుంచి 15.5% మందినే ఎంపిక చేశారని చెప్పారు. ఎస్సీలు 5%, ఎస్టీలు 3 శాతమే ఎంపికయ్యారని వివరించారు. ఆయా వర్గాలు కోల్పోతున్న రిజర్వేషన్లపై బీసీ మేధావులు గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ నాయకులు వీ ప్రకాశ్, సుందర్రాజుయాదవ్, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్రావు, భారత జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్భాసర్, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.