హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ పక్షపాతానికి ముగింపు ఎప్పుడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాని మోదీని ప్రశ్నించారు. గత 8 సంవత్సరాల పరిపాలనలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానికి సోమవారం ఆమె ట్విట్టర్ వేదికగా 8 ప్రశ్నలను సంధించారు.
కవిత సంధించిన ప్రశ్నలు
1. మహిళాశక్తికి సమాన ప్రాధాన్యం కల్పించడం ద్వారా వారికి సాధికారత కల్పించే లక్ష్యంతో రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఎకడున్నది మోదీ జీ?
2. గ్రాస్ డొమెస్టిస్ ప్రాడక్ట్ (జీడీపీ).. గ్యాస్, డీజిల్, పెట్రోల్ (జీడీపీ) ధరలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. అవి దేశ నియంత్రణలో ఎందుకు లేవు? అమితంగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎకడ పెట్టుబడి పెట్టారు?
3. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వ పక్షపాతానికి ముగింపు ఎప్పుడు? తెలంగాణకు రావాల్సిన రూ. 7,000 కోట్ల పెండింగ్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు?
4. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకొన్నది. ‘మెహంగై ముక్త్ భారత్’ అని ప్రకటించుకొన్న మోదీజీ… అసలు అలాంటి ’అచ్చే దిన్’ ఎప్పుడు తెస్తారు?
5. దేశంలో విఫలమైన లా అండ్ ఆర్డర్, విఫలమైన వ్యవస్థలు కనిపిస్తున్నాయి. భారత ప్రజలకు కృత్రిమ ప్రచారాలు లేని నిజమైన ‘అమృత్ కాల్’ ఎప్పుడు వస్తుంది ?
6. రైతులు భారతదేశానికి గుండె చప్పుడు. కానీ ఈ రోజు తెలంగాణలో వరి, పసుపు రైతులు తమ కష్టానికి కనీస గుర్తింపును కోరినందుకు బీజేపీ చేతిలో నష్టపోతున్నారు.
7. మోదీ ప్రభుత్వ ‘న్యూ ఇండియా’ వాస్తవికత ఏంటంటే, కోట్లాది మంది భారతీయులు తమకు కనీస ఆదాయం అందించే ఉపాధిని పొందడంలో కష్టపడుతున్నారు.
8. పీఎం కేర్స్ గురించి ప్రజలకు తెలుస్తుందా? పీఎం కేర్స్ నిధుల గురించిన నిజమైన సమాచారం దేశ ప్రజలకు తెలిపే రోజు వస్తుందా?