నిజామాబాద్ : నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో ఆరు రోజుల పాటు సాగిన ప్రతిష్ఠాపన మహోత్సవం బ్రహ్మాండంగా సుసంపన్నమైంది. నరసింహ యాగఫలమా అన్నట్లు వానదేవుడు కరుణించడంతో వాతావరణం చల్లబడింది. భక్తులు ఆహ్లాదకర వాతావరణంలో స్వామి వారి తొలి దర్శనం చేసుకుని పులకించి పోయారు. ఆరో రోజు కార్యక్రమంలో భాగంగా ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించబడిన రాజ్యలక్ష్మి సమేత నరసింహుడు, అతని పరివారం మూర్తుల సంప్రోక్షణ వేడుకగా సాగింది. విమాన శిఖరం ప్రతిష్టాపన ఉత్సవం, ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవం కన్నుల పండుగగా జరిగాయి. లోక సంక్షేమాన్ని కోరుతూ నిర్విఘ్నంగా ఐదు రోజుల పాటు నరసింహ యాగ పూర్ణాహుతి వైభవంగా జరిగింది.
శ్రీ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహ తిరు కళ్యాణం నరసింహ స్వామి ఉపన్యాసకులు వేదాల భార్గవ నరసింహస్వామి ఆధ్వర్యంలోని బృందం రమణీయంగా నిర్వహించింది. భక్తుల రాకతో, ప్రముఖుల సందడితో అపర వైకుంఠంగా ఆలయ ప్రాంగణం నరసింహస్వామి నామస్మరణతో మార్మోగింది. 6 రోజుల కార్యక్రమాలు అనన్య సామాన్యంగా నిర్వహించిన వేదపండితుల బృందానికి యజమానులు శాసనమండలి సభ్యులు కల్వకుంట్ల కవిత, డి.ఆర్ అనిల్ కుమార్ దంపతులు ఘనంగా సన్మానించారు.
నరసింహ మాలధారణం వేద ఆశీర్వచనాలుతో భక్తులు తన్మయత్వం చెందారు. వేలాదిగా హాజరైన ప్రజలు నూతనంగా కొలువైన స్వామి వారిని దర్శించి పరవశించిపోయారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం అనుసారం జరిగిన జల క్షీరాది అథివాసాలు శిల్పి చెక్కిన దేవతామూర్తుల శేష మలినాలను నిశ్శేషం చేసి, అనన్యమైన శక్తులను నిక్షిప్తం చేసి, మహిమాన్వితమైన ప్రాణప్రతిష్ట చేసి, కోరిన కోరికలు తీర్చే స్వామివారిని గర్భగుడిలో ప్రతిష్ట చేసిన క్రతువు ఆరు రోజులపాటు భక్త జనరంజకంగా సాగింది.
గర్భంలో ఉన్న శిశువుయందు, జ్ఞానాన్ని, శరీర వృద్ధి శక్తి, మాతృమూర్తి స్థాపితం చేసినట్లు, శిల్పి తన మాతృ హృదయంతో శిలను తొలిచి స్వామివారిని సాక్షాత్కరింప జేసిన తీరును వేద పండితులు ప్రత్యక్షంగా సోదాహరణంగా వివరించిన విధానం భక్తులను మెప్పించింది. ఇకనుంచి స్వామివారు భక్తులకు మంగళ దర్శనమిస్తారని, ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, నరసింహ స్వామి జయంతి, ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవచ్చని వేదపండితులు వేదాల భార్గవ నరసింహస్వామి తెలిపారు.
ఈ సందర్భంగా విశేష సేవలందించిన పండితులను, భూమి దాతలను ఘనంగా సన్మానించారు. సిహెచ్ కొండూరు సర్పంచ్ దమ్మన్నగారి ప్రభాకర్, ఎంపీటీసీ రాజు, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించారు.