న్యూఢిల్లీ : సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై కలాన్ని పదును పెట్టి.. సమాజాన్ని ఐక్యంగా ఉంచేలా కృషి చేయాలని కవులకు, రచయితలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ దేశంలో సమాజాన్ని విడదీసే వాతావరణాన్ని మనం చూస్తున్నామని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఈ దేశంలో సహృద్భావ వాతావరణం సృష్టించడానికి సాహిత్య కారులు కృషి చేయాలని కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆజ్ తక్ (ఇండియా టుడే) సాహిత్య సమ్మేళనం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
సాహిత్య రంగానికి విశేషంగా కృషి చేసిన వారికి వచ్చే ఏడాది నుంచి భారత్ జాగృతి ఫౌండేషన్ – ఇండియా టుడే సంయుక్తంగా సాహ్యిత పురస్కారాన్ని అందిస్తాయని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘సాహిత్యం జ్ఞానాన్ని ఇస్తుందటారు. సాహిత్యం జ్ఞానాన్ని ఇవ్వాలి అదే సమయంలో సమాజంలో మంచి వాతావరణం సృష్టించేలా సాహిత్యం ఉండాలి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రీత్యా దేశంలో మంచి వాతావరణం కల్పించే బాధ్యత కవులు, రచయితలపై ఉంటుంది. సాహిత్యకారులను ప్రోత్సహించడానికి, వారికి అండగా ఉండడానికి అవార్డును నెలకొల్పాం’ అన్నారు.
ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా కవులు, రచయితలు దేశం పట్ల మరింత బాధ్యతలో రచనలు చేస్తారని అభిప్రాయపడ్డారు. దేశంలో సమాజాన్ని విడగొట్టడానికి, మనసులను దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఈ మేరకు కవులు, రచయితలు కలాలకు పదును పెట్టాలని పిలుపునిచ్చారు. విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే కవులు సమాజాన్ని కలిపేందుకు కృషి చేయాలని అన్నారు. ఆ కృషికి భారత్ జాగృతి ఫౌండేషన్, ఇండియా టుడేతో పాటు తామంతా అండగా నిలబడుతామని, కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. సాహిత్యకారులను సన్మానించుకుంటే సమాజం గౌరవం పెరుగుతుందన్నారు.
యువతకు సాహిత్యం అర్థంకాదని.. భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో కలిసి రావడం లేదని కొందరు అంటున్నారన్న కవిత.. కానీ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనడం గర్వంగా ఉందని తెలిపారు. దేశ సాహిత్యం భారత యువత చేతుల్లో భద్రంగా ఉందని భావిస్తున్నానని చెప్పారు. సాహిత్యంపై మక్కువతో కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. శబ్దమే శక్తి అని తాను బలంగా విశ్వసిస్తానని, ఒక శబ్దం లక్షాలది హృదయాలను కదిలిస్తుందన్నారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని అన్నారు.