హైదరాబాద్: పాత ఆలోచనలు భోగి మంటల్లో వేసి.. కొత్త ఆలోచనలకు నాంది పలకడం ఈ పండుగ ఉద్దేశమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను అందరం ఘనంగా జరుపుకుంటామన్నారు. హైదరాబాద్లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనలోని ప్రతికూలతలను విడిచిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్దామన్నారు.
తెలంగాణ జాగృతి నుంచి భారత్ జాగృతిగా రూపాంతరం చెందాక మొదటి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పల్లెవాతావరణాన్ని నగరానికి తీసుకొచ్చిన హైదరాబాద్ జాగృతివారిని అభినందించారు. కాగా, భోగి వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి.