హైదరాబాద్: నగరంలోని తెలుగు యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ కిషన్ రావు, ఉద్యోగులు, విద్యార్థులు వారికి సాదర స్వాగతం పలికారు. వర్సిటీ ఆవరణలో విశ్వవిద్యాలయ సిబ్బందితో కలిసి గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసైతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
బతుకమ్మ అత్యంత ప్రాచీనమైన పండుగ అని కవిత చెప్పారు. బతుకమ్మ పాటలో ఉండే తెలుగు పదాల మీద పరిశోధన చేయాలని, అప్పుడే తెలుగు బాష మరింత పరిపుష్టం అవుతుందని చెప్పారు. తెలంగాణ జాగృతితో పాటు, అనేక సంస్థలు బతుకమ్మ పండుగకు సంబంధించి పాత పాటలను సేకరిస్తున్నాయని తెలిపారు.
పాత పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేస్తే మనం మరచిపోయిన తెలుగు పదాలు, తెలంగాణ పదాలు మళ్లీ బాషలో చేరే అవకాశం ఉందన్నారు. బతుకమ్మ పండుగ మీద అనేక మంది పరిశోధనలు చేస్తున్నారని వెల్లడించారు.