బోధన్, నవంబర్ 26: ‘కార్ కా నిషాన్.. తెలంగాణ కా షాన్ హై’ అని కవిత అన్నారు. ఆదివారం బోధన్ నియోజక వర్గంలోని ఎడపల్లి మండలం జాన్కంపేట్, నెహ్రూనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్కు మద్దతుగా రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలకు నిజమైన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని, వారిని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ముస్లింలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముస్లింల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఏమీ చేయలేదని, ఆ పార్టీ కుట్రలో పడొద్దని అన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో మత కలహాలు జరుగుతున్నాయని, గతంలో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండగా తరచూ మత కలహాలు చెలరేగడం, కర్ఫ్యూలు విధించడం, భయంకరమైన పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాలను సమానంగా చూస్తున్నదని, ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఇచ్చిందని చెప్పారు. ఏ ఒక్క మతం పట్ల వివక్ష చూపకుండా పరిపాలించామని, లౌకికవాదం అంటే ఏమిటో ఆచరణలో చూపించినట్టు తెలిపారు.
కాంగ్రెస్కు ఓటేస్తే ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఇస్తున్న కరెంట్, రైతుబంధు, ఆసరా పింఛన్లు బంద్ అవుతాయని, పాత కష్టాలు మళ్లీ పునరావృతవుతాయని కవిత హెచ్చరించారు. కేసీఆర్ సీఎం కాకముందు పొలాలకు నీళ్లు వచ్చేవి కావని, తాగునీరు, కరెంట్ ఉండేవి కావని, అరకొర పింఛన్లు మాత్రమే ఇచ్చేవారని, రైతుబంధులాంటి పథకాలు లేవని గుర్తుచేశారు. మళ్లీ ఆ కష్టాలు రాకూడదని, ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలతోపాటు తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే బీఆర్ఎన్ను గెలిపించాలని కోరారు.