హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో ఆంధ్రప్రాంతం వారికి ఉద్యోగాలు ఎలా ఇస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండలిలో నిలదీశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) విభాగంలో ఏపీలోని కర్నూలుకు చెందిన ఏ రామిరెడ్డి కుమారుడు రఘునాథ్రెడ్డికి ఉద్యోగం ఇవ్వడం పట్ల ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై సభలో ప్రస్తావించాలని ఆమె స్పీకర్కు లేఖ అందించారు.
రఘునాథ్రెడ్డి పాఠశాల విద్యాభ్యాసం అంతా కర్నూల్లోనే జరిగిందని, అతను తెలంగాణ వ్యక్తి కాకపోయినప్పటికీ 2007 జూలై 12న ఇచ్చిన జీవోను కోట్ చేస్తూ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. అప్పటికి రాష్ట్రం కలిసే ఉందని, 2014 తర్వాత మన రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా ఎన్నో నిబంధనలు మారాయని ఆమె చెప్పారు. అలాంటప్పుడు రఘునాథ్రెడ్డికి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఇది చాలా దారుణమని, తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఉద్యోగాల్లో అన్యాయం జరిగితే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ బిడ్డల పొట్ట కొట్టొద్దని కోరారు. ఈ సందర్భంగా అక్రమ నియామకం విషయాన్ని లేఖ రూపంలో మండలి చైర్మెన్ దృష్టికి తీసుకెళ్లారు. కవిత మాటలకు మంత్రి దామోదర రాజనర్సింహ వివరణ ఇస్తూ.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా నిబంధనలకు లోబడే ఉంటాయని, ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.