హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 20 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీ ఈ బిల్లుపై కపట రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కవిత శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది 20 ఏండ్లు దాటిందని, లోక్సభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉన్నదని తెలిపారు. గత 20 ఏండ్లుగా ఈ బిల్లుపై సోనియాగాంధీ, రాహుల్గాంధీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఈ బిల్లును పాస్ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు. 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చలేదని ధ్వజమెత్తారు. ఏ రకంగా చూసినా మహిళా బిల్లు కోసం సోనియాగాంధీ, రాహుల్గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.
మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం చేసిందని కవిత గుర్తుచేశారు. శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా మరోసారి ఈ బిల్లుకు అనుకూలంగా తీర్మానం చేశారని, ప్రధానికి సీఎం కేసీఆర్ కూడా లేఖ రాశారని చెప్పారు. తాను కూడా తన స్థాయిలో రకరకాల ఉద్యమాలు చేశానని, ఇతర పార్టీలతో కలిసి కూడా ఉద్యమాలు చేపట్టానని గుర్తుచేశారు.
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి తనకు లేదని కాంగ్రెస్ నాయకులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడాది క్రితమే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే, పవన్బన్సల్తోపాటు ఏపీ, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులను ఈడీ విచారించిందని, ఆ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీకి మధ్య అవగాహన కుదిరినందుకే ఈడీ విచారణకు పిలవడం లేదా? అని అనుమానం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని, మరో రాష్ట్రంలో అదే కమ్యూనిస్టులతో కొట్లాట పెట్టుకుంటుంది. ఒక దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీతో కొట్లాడుతారు.. మరోచోట ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. ఇలా బహుళ రాష్ట్రాల్లో బహుళ విధానాలను కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నది’ అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అదానీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతూ, ఇతర రాష్ట్రాల్లో ఆ కంపెనీని వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు.