హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశంలో ఫాసిస్టు వ్యవస్థ నడుస్తున్నదని, దీనిపై కవులు, కళాకారులు, రచయితలు గళమెత్తాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ కళాభారతి స్టేడియంలో జరుగుతున్న 36వ జాతీయ పుస్తక ప్రదర్శనను ఆదివారం కవిత సందర్శించారు. అనంతరం ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం’ పుస్తకంపై చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నల్లమల అడవి, చెంచులు, ప్రకృతిని వల్లంకి తాళం అద్భుతంగా వర్ణించిందని కొనియాడారు. యురేనియం, వజ్రాల కోసం కేంద్రం అడవిని తవ్వే ప్రయత్నం చేస్తే, తెలంగాణ ఉద్యమ సమయంలో తాను, మరికొంతమందిమి అప్పుడు పెద్దఎత్తున ఆందోళన చేశామని, మైనింగ్ లీజును రద్దు చేసే వరకు పోరాటం చేశామని వివరించారు. తవ్వకాలు జరపకుండా అసెంబ్లీలో బీఆర్ఎస్ సర్కారు తీర్మానం చేసిందని గుర్తు చేశారు. అడవికి గాయమైతే ఊరుకొనే సంస్కృతి మనది కాదని తెలిపారు. వల్లంకి తాళంలోని కవితలను చాలాసార్లు చదివానని, ఆకుపచ్చని అడవిలో దొరికే అనేక పండ్ల ప్రస్తావనలు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాండలికంపై చర్చ జరిగిందని, అలాంటింది మాండలికాల్లో ఉప మాండలికంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి గోరటి వెంకన్న కవితలు రాయడం తనకు సంతోషాన్నిచ్చిందని వివరించారు. వెంకన్న రచనాశైలి అద్భుతంగా, తెలంగాణ ఆత్మను ఆవిష్కరిస్తుందని కొనియాడారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తే 2,500 మంది చిన్నారులు కవిత్వం రాశారని గుర్తుచేశారు.
కేంద్ర సాహిత్య అకాడమీ తొలి తెలుగు అవార్డు తెలంగాణ బిడ్డకే
కేంద్ర సాహిత్య అకాడమీ తొలి తెలుగు అవార్డు తెలంగాణ బిడ్డకు 1955లో సురవరం ప్రతాపరెడ్డికే వచ్చిందని, ఆ పరంపర గోరటి వెంకన్న వరకు కొనసాగుతూ వస్తున్నదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. సురవరంతో పాటు సినారె, దాశరథి, ఎన్ గోపి, చేకూరి రామారావు, అంపశయ్య నవీన్, సామల సదాశివ, కాత్యాయని విద్మహే, నిఖిలేశ్వర్, గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయని, ఇటువంటి మహానుభావులు, గొప్ప కవులున్న వారసత్వం తెలంగాణదని స్పష్టం చేశారు. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో సురవరం ఆనాటి సామాజిక పరిస్థితులను విశ్లేషించారని, కాళోజీ ప్రజల గోసను తన గొడవగా చెప్పుకున్నారని వివరించారు. సినారె విశ్వమానవుల గురించి ‘విశ్వంభర’లో వివరించారని, దాశరథి చాలా సంవేదనతో ఈ భూగోళం పుట్టాలంటే ఎన్ని సురగోళాలు రాలిపోయాయో.. ఇప్పటి మానవ రూపం జరగడానికి ఎంత పరిణామం చెందాల్సి వచ్చిందోనని చెప్పారని గుర్తుచేశారు. పనిలో నుంచి, శ్రమలో నుంచి వచ్చిన పదాలను మనం కాపాడుకున్నాం కాబట్టే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని అంటారని చెప్పారు. తెలంగాణ యాసనే కాకుండా మహబూబ్నగర్ జిల్లాలో పుట్టిన పదాలను వల్లంకి తాళం పుస్తకంలో వెంకన్న వాడారని పేర్కొన్నారు.