MLC Kavitha | తెలంగాణను దేశంలోని నంబర్ వన్గా తీర్చిదిద్దిన ప్రజాదరణ కలిగిన సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కర్ణాటకలో మాదిరిగా కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్దని.. మేనిఫెస్టోలో చేర్చని హామీలను సైతం అమలు చేసి చూపించారని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గొప్ప రాష్ట్రమైన కర్నాటకలో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందన్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు వచ్చే ముందు ఇక్కడి స్థితిగతులన్నింటినీ తెలుసుకొని రావాలని సిద్ధరామయ్యకు చురకలంటించారు.
అనేక పథకాలతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని తెలిపారు. బీసీల భావోద్వేగాలను గౌరవిస్తూ అందరినీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదరిస్తోందన్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పరిసర జిల్లాల అభివృద్ధిలో దూసుకుపోతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి సందర్భంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కర్నాటక సీఎం సిద్ధరామయ్య కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారని విమర్శించారు. బీసీ డిక్లరేషన్ సత్యదూరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో పడేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. అప్పుడే తెలంగాణ మరింత ముందుకు సాగుతుందన్నారు. జిల్లాకు చెందిన అనేక మంది కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి సేవలు అందించారని, అయినప్పటికీ జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు.
2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 8 జనరల్ సీట్లలో కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లను బీసీలకు కేటాయించిందని కవిత గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో రేటెంతరెడ్డి గాంధీ భవన్లో గాడ్సేలా దూరిన తర్వాత బాన్సువాడలో బీసీ నాయకుడు కాసుల బాల్రాజు టికెట్ను ధనవంతుడైన ఏనుగు రవీందర్ రెడ్డికి అమ్ముకున్నారని విమర్శించారు. ఎల్లారెడ్డి, ఆర్మూర్, బాల్కొండ టికెట్ను బీసీలకు అవకాశం ఇవ్వకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చారని వివరించారు. దాదాపు 10-15 మంది బీసీల నాయకుల రాజకీయ భవిష్యత్కు రేటు కట్టి వందలాది కోట్లకు టికెట్లను కాంగ్రెస్ అమ్ముకుందని పేర్కొన్నారు. రేటెంత రెడ్డి పోటీ చేస్తున్నారన్న కారణంతో కామారెడ్డి నుంచి మైనారిటీ అయిన షబ్బీర్ అలీని నిజామాబాద్కు తరిమేశారని స్పష్టం చేశారు. టికెట్ రాలేదన్న మనస్థాపంతో కాసుల బాల్ రాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని, కామారెడ్డి వరకు వచ్చిన రేవంత్ రెడ్డి కనీసం పరామర్శించలేని మానవీయకోణం లేకపొవడం దురదృష్టకరమన్నారు.
బీసీల రాజకీయ జీవితాలకు సమాధి కడుతూ టికెట్లు అమ్ముకుంటున్న పార్టీ కాంగ్రెస్ అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందే టికెట్లను వందల కోట్లకు అమ్ముకున్న వ్యక్తి నడిపించే పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే మొత్తం తెలంగాణను గంపగుత్తగా అమ్ముతారు తప్పా ప్రజల గురించి కాంగ్రెస్ నాయకులు ఆలోచించబోరని చెప్పారు. గతంలో కాంగ్రెస్ భయానక పాలనను ప్రజలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే అక్కడి సీఎం సిద్ధరామయ్య మన రాష్ట్రానికి వచ్చి బీసీలకు ఏం చేయాలో మన సీఎం కేసీఆర్కు పాఠాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీసీల కోసం దాదాపు రూ.45వేల కోట్లను ఖర్చు చేసిందని వివరించారు. ఇంత పెద్ద ఎత్తున బీసీ సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటామా లేదా రాజకీయంగా, విద్యాపరంగా, ఆత్మగౌరవం పరంగా అణగదొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటామా అన్నది ఆలోచించాల్సిన సందర్భం వచ్చిందన్నారు. దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ బీసీ జనాభా లెక్కలు తీసే ధైర్యం లేని పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. 2004లో ఆర్ కృష్ణయ్యను తీసుకెళ్లి సీఎం కేసీఆర్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిసి బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగణన చేపట్టాలని కోరినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయని దౌర్భాగ్యమైన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.