MLC Kavitha | నిజామాబాద్ : తనపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు 24 గంటల పాటు సమయం ఇస్తున్నానని, ఆ లోగా ఆరోపణలలో రుజువు చేయకపోతే పులాంగు చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే బాగుండదని అరవింద్ను ఆమె హెచ్చరించారు.
శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పనిచేస్తోందని, అందుకే ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామని తెలిపారు. గతంలో పాలించిన పార్టీలు కమీషన్లకు కక్కుర్తి పడేదని, బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో రింగ్ రోడ్డును పూర్తి చేయలేకపోయారని అన్నారు. తనతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు వెంటపడి పరిష్కస్తే నిర్మాణం పూర్తయిందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డబ్బులు ఎవరు, ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు.
అరవింద్కు 24 గంటల సమయం ఇస్తున్నా.. నాకు ఎవరు ఒక రూపాయి ఇచ్చారో రుజువు చేయాలి అని కవిత డిమాండ్ చేశారు. కాగితం పట్టుకురా… లేకపోతే పులాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి అని సవాల్ విసిరారు. తన తండ్రిని అంటే వదిలేశామని, ఇప్పుడు తన భర్తను కూడా విమర్శిస్తున్నారని, ఎవరూ ఊరుకోరని, మజాక్ చేస్తే బాగుండదని హెచ్చరించారు. రాజకీయాల్లో లేని తన భర్త పేరును ఎందుకు తీస్తున్నారని అర్వింద్ను నిలదీశారు. చౌకాబారు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వెళ్లి ఆయనను ఓడించి తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని కవిత తేల్చిచెప్పారు.
మణిపూర్ అల్లర్లపై, నిరుద్యోగంపై బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని కవిత ప్రశ్నించారు. రైతు బంధు పథకానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఎస్ఆర్ఎస్పీ పునరుద్ధరణ ప్రాజెక్టులో బీజేపీది ఒక్క రూపాయి కాంట్రిబ్యూషన్ లేదని చెప్పారు. జాతీయ రహదారులపై గుంతలు ఉంటాయా ఎక్కడైనా ? ఏం చేస్తున్నాడు గడ్డిపీకుతున్నాడా ? అని అర్వింద్ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అన్ని విషయాలపై నిలదీస్తామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అర్వింద్ ఏం తెచ్చారని నిలదీశారు. అబద్ధాల మీద సమాజం నడవదని సూచించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడమే బీజేపీ ఎజెండా అని కవిత ఆరోపించారు.
రైతులు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కసు వెల్లగక్కుతున్నారని, రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యాపారవేత్తలకు కూడా మూడు గంటలే సరిపోతుందని చెప్పగలదా అని కవిత ప్రశ్నించారు. పైసలు ఉన్న వారి పక్షాన మాత్రమే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నిలబడుతాయని, బీఆర్ఎస్ ఎప్పడూ పేదల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాతున్నారో వాళ్లకే అర్థంకాదు. మూడు గంటలు విద్యుత్ చాలని అంటారు. 25 గంటల కరెంట్ ఇస్తామని అంటారు. అప్పుడే సోనియా గాంధీ దయ్యమంటరు… పావురాల గుట్టలో పావురంలా మాయమైపోయాడని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వైఎస్ ఉచిత కరెంట్ ఇచ్చిండని అంటారు. అర్థంపర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతారు అని కాంగ్రెస్ నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రైతుల పట్ల కాంగ్రెస్ వైఖరి ప్రజలకు అర్థమైందని కవిత చెప్పారు. రైతులకు కాంగ్రెస్ సాయం చేయదన్న ఆలోచన ప్రజల్లో వచ్చిందన్నారు. ధరణిని రద్దు చేసి దళారులను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని ఆరోపించారు. ధరణి వల్ల భూవివాదాలు సమసిపోయాయని, చిన్నచిన్న సాంకేతిక సమస్యలు ఉంటే ప్రభుత్వం సరిదిద్దుతోందని చెప్పారు. ధరణి మా విధానం… దళారి కాంగ్రెస్ విధానం అని కవిత విమర్శించారు.
బీఆర్ఎస్, బీజేపీకి డీఎన్ఏ మ్యాచ్ కాదని కవిత పేర్కొన్నారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమాన దూరంలో ఉంటామని స్పష్టం చేశారు. తమకు కాంగ్రెస్తోనే పోటీ అని తెలిపారు. గతం కంటే భారీ మెజారిటీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవబోతున్నారని అనేక సర్వేలు తేల్చాయని కవిత వెల్లడించారు.