హైదరాబాద్: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం రేవంత్ మాటలు ఉత్తవేనని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూ.2500 వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఐదేండ్లలో లక్ష కోట్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ వట్టిదేనని చెప్పారు. మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. జాగృతి మహిళా కార్యాకర్తల నుంచి సేకరించిన 10 వేల పోస్టుల కార్డులను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. హామీల అమలుపై మార్చి 8న ప్రకటన చేయకపోతే 10 వేల మహిళలం 10 వేల గ్రామాల్లోకి వెళ్తామన్నారు. లక్షలాది పోస్టు కార్డులను తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తామని చెప్పారు. మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదని విమర్శించారు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదన్నారు.
సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తుచేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమీలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. వరంగల్ విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవీ పేరు పెట్టాలడి డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాము కూడా కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం ప్రకటనకు, ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్కు పోలిక లేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు కేవలం పదుల సంఖ్యలో మహిళలకు తప్పా పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశంలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెడితే ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. 18 ఏండ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. మార్చి 8న ఈ పథకాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
వడ్డీ లేని రుణాలపై ప్రభుత్వం అందంగా అబద్ధాలు చెబుతున్నదని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఎగ్గొట్టిందని విమర్శించారు. వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, వడ్డీ రాయితీ బకాయిలు విడుదలతో పాటు రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలన్నారు. భర్త చనిపోయిన మహిళలకు కొత్తగా పెన్షన్ ఇవ్వడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు వస్తున్న పింఛన్లు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. కొత్తగా పెన్షన్దారులను నమోదుచేయడం లేదన్నారు. తక్షణమే పింఛన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచడంతోపాటు, అభయ హస్తం నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని విమర్శించారు. నేరాల శాతం 20 శాతం పెరిగాయని డీజీపీ వెల్లడించారు. ఆడబిడ్డలకు రక్షణపై ప్రభుత్వం సమీక్షించి ప్రకటన చేయాలన్నారు. కేసీఆర్ కిట్ పంపిణీని నిలిపివేసి కాంగ్రెస్ పార్టీ మానవత్వాన్ని మంటకలిపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంనటే కేసీఆర్ కిట్ను కొనసాగించాలని చెప్పారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను పెంచాలన్నారు. మహిళా కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి అవసరమైన సదుపాయాలు కల్పించాలని చెప్పారు. మహిళా కార్మికులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్మికుల జీతాలను పెంచుతామని హామీ ఇచ్చిన విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం..
వెంటనే అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఢాంబికాలు పలుకుతున్నదని విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే ఆ పోస్టులను సృష్టించారని గుర్తుచేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆడపిల్లలకు ఫీజు రియింబర్స్మెంట్ చేయడం లేదని, దీంతో తల్లిదండ్రులు వారిని చదువు మానిపిస్తున్నారని తెలిపారు.