MLC Kavita : చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్(Womens Reservation) కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavita) పోరాటం ఫలించనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశా(Parliament Special Sessions)ల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీన ఈ బిల్లుపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో ఈరోజు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రేపటి నుంచి కొత్తగా నిర్మించిన భవనంలో ఈ సమావేశాలు జరుగనున్నాయి.
పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీ కవిత ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని కోట్లాది మహిళల పక్షాన ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద దీక్ష కూడా చేపట్టారు. అంతేకాదు ఈ బిల్లుకు మద్దతు పలకాలని దేశంలోని 49 రాజకీయ పార్టీలను కోరారు. అందుకోసం రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలని, అందరూ ఒక్క మాటపై నిలబడి మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఒత్తిడి తేవాలని ఆమె ఆయా పార్టీలను అభ్యర్థించారు.