MLC Kavitha | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలను విస్మరించటం సరైంది కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేంద్రం తలచుకుంటే తక్షణమే బిల్లును అమలులోకి తేవచ్చని అన్నారు. రష్యా అధికార వార్తా సంస్థ స్పుత్నిక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళా రిజర్వేషన్ బిల్లు, దాని పర్యవసానాలు, నేపథ్యాన్ని ఆమె వివరించారు. భారత దేశ చరిత్రలో తొలిసారిగా పార్లమెంటు మహిళా బిల్లును ఆమోదించడం, దీని వెనుక ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉండటాన్ని రష్యా పత్రిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆ ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంపై మీ స్పందన ఏమిటి?
రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగడానికి మొదటి అడుగుపడినందుకు సంతోషంగా ఉంది. దేశంలో కుల వ్యవస్థ ఉన్న నేపథ్యంలో బిల్లులో ఓబీసీల గురించి ప్రస్తావన లేదు. చట్టసభల్లో ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉండేది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల లోక్సభలో మహిళల సంఖ్య 181కి చేరుతుంది, ఇప్పుడు కేవలం 80 మంది మాత్రమే ఉన్నారు.
పార్లమెంటులో చర్చ సందర్భంగా ఈ బిల్లు క్రెడిట్ తమదే అని అన్ని రాజకీయ పార్టీలు అన్నాయి. ఈ క్రెడిట్ ఎవరు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు ?
ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ వ్యక్తికి క్రెడిట్ ఇచ్చే బదులు ఈ క్రెడిట్ దేశ మహిళలకు వెళ్లాలన్నది నా భావన. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మహిళలు, పురుషులకు సమాన ఓటు హకు లభించింది. చాలా దేశాల్లో ఓటు హకు కోసం మహిళలు ఇంకా పోరాడుతున్నారు. దూరదృష్టి కలిగిన మన నాయకులు మహిళలకు ఓటు హకు కల్పించారు. నిజానికి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనేకమంది మహిళా నాయకులు రిజర్వేషన్ వద్దని అన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మహిళలకు సరైన వాటా దకుతుందని వారి ఆలోచనగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు గత 75 ఏండ్లలో చట్టసభల్లో మహిళలకు సరైన భాగస్వామ్యం లభించలేదు. అందువల్లనే 1970ల తర్వాత రాజకీయాల్లో సరైనా భాగస్వామ్యం కోసం మహిళా రిజర్వేషన్ల డిమాండ్ వచ్చింది. ఆ పోరాట ఫలితమే 33 శాతం రిజర్వేషన్లు. ఈ క్రెడిట్ తీసుకోవద్దు. 75 ఏండ్లుగా ఏ రాజకీయ పార్టీ కూడా మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాధాన్యం కల్పించలేదు. 10 రోజుల క్రితం మహిళా రిజర్వేషన్ల కోసం మా పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలోనే మహిళా రిజర్వేషన్ల బిల్లుతోపాటు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని తీర్మానం చేశాం. మా పార్టీ ఈ అంశాల పట్ల చిత్తశుద్ధితో ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ గత తొమ్మిదిన్నరేండ్లుగా మహిళా రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించింది. రాజకీయ ఒత్తిడితోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలన్న నిర్ణయం జరిగింది. ఈ బిల్లుపై హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ వరింగ్ కమిటీ కూడా తీర్మానం చేసింది. మహిళా బిల్లుకు అనుకూలంగా డిమాండ్లు వస్తుండటం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తీర్మానం చేయడం వంటి వాటి వల్ల బిల్లును ప్రవేశపెట్టాలన్న ఒత్తిడి ప్రభుత్వంపై వచ్చింది.
రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలు ఎలా ముందుకెళ్లాలి ?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి మహిళా నాయకులు ఇతర మహిళలను ప్రోత్సహించారు. అలా మహిళలను ప్రోత్సహించాలని అందరూ అనుకోవాలి. ఇప్పటివరకు కొంతమంది మహిళలే రాజకీయాల్లోకి ప్రవేశించి పోరాటాలు చేశారు. ప్రస్తుతం దేశంలో మహిళలు చదువుకున్నారు. రాజకీయంగా అవగాహనతో ఉన్నారు. అదే వాళ్లు రాజకీయాల్లోకి రావడానికి మార్గం చూపిస్తుంది. బిల్లు ఆమోదం పొందింది కాబట్టి ఇక రాజకీయ పార్టీలే మహిళలను ప్రోత్సహించాలి.
బిల్లు ఆమోదం పొందినప్పటికీ డీలిమిటేషన్ తర్వాతనే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అప్పటివరకు మహిళలు వేచి చూడాల్సిందేనా ?
అవును, వచ్చే ఎన్నికల నుంచే రిజర్వేషన్లు అమలు కావడం లేదన్న అసంతృప్తి ఉన్నది. ఈ బిల్లును తక్షణమే అమలు చేయడం సాధ్యమే. కానీ ప్రభుత్వం అసంబద్ధమైన సాంకేతిక కారణాలు చెప్పి వాయిదా వేసింది. రాజ్యాంగం ప్రకారం 2026 తర్వాతనే డీలిమిటేషన్ జరగాల్సి ఉంది. దానికి మహిళా రిజర్వేషన్లకు సంబంధం లేదు. ఆ విషయాన్ని ప్రభుత్వం ఎత్తిచూపుతూ రిజర్వేషన్లను జాప్యం చేస్తున్నది. ప్రభుత్వం తలచుకుంటే, రాజకీయంగా చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయవచ్చు. అందుకు 2011 జనాభా లెకలను ఆధారంగా చేసుకోవచ్చు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో 2024 ఎన్నికల్లో బీజేపీకి లాభం జరుగుతుందని మీరు భావిస్తున్నారా?
అలా నేనేం భావించడం లేదు. 2014, 2019 ఎన్నికల వివరాలను బట్టి చూస్తే మహిళలు క్రియాశీలక ఓటర్లు అని అర్థమవుతుంది. నా నియోజకవర్గంలో కూడా పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎకువగా ఉన్నారు. మహిళలు రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు, బీజేపీ ఈ బిల్లును ఎందుకు తీసుకొచ్చిందో వారు అర్థం చేసుకోగలరు. ఓబీసీ మహిళలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదో, 2024 ఎన్నికల్లో ఎందుకు అమలు చేయడం లేదో కూడా మహిళలకు తెలుసు. అసలు బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందా ? రాదా ? అన్నది ఎవరికి తెలుసు? కరోనా వల్ల 2021లో జరగని జనగణనను 2022 లేదా 2023లో జరపాల్సింది. కానీ వాళ్లు జనగణన చేయలేదు. అది మహిళల తప్పు కాదు. ఈ పరిణామాలను మహిళలు గమనిస్తున్నారు. ఈ బిల్లు వల్ల బీజేపీకి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లభించదనేది నా అభిప్రాయం.
మహిళా రిజర్వేషన్లు రాజ్యసభలో, రాష్ట్రాల శాసనమండలిలో వర్తించవు. దీని గురించి మీరు ఏమి చెప్తారు ?
ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా రాజ్యసభకు సభ్యులు ఎన్నికవుతారు. సాంకేతికంగా ఈ రిజర్వేషన్లను అమలుచేయడం సాధ్యం కాదు. కానీ, దానికి ప్రత్యామ్నాయంగా మరో పద్ధతిని పాటించవచ్చు. అన్ని నామినేటెడ్ పదవుల్లో 33 శాతం మహిళలకు ఇవ్వాలని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు చెప్తే రాజ్యసభలో, శాసనమండళ్లలో మహిళల సంఖ్య పెరుగుతుంది. ఎన్నికల సంసరణల ద్వారా ఈ రెండు సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచవచ్చు. అదృష్టవశాత్తు స్థానిక సంస్థల్లో ఇప్పటికే 14 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు తొలిమెట్టు మాత్రమే. మహిళా సాధికారత కోసం ఎంతో చేయాల్సి ఉన్నది. అది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించింది. మారెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది. తద్వారా దళిత గిరిజన మహిళలు మారెట్ కమిటీకి చైర్ పర్సన్లుగా నియమితులయ్యారు. ఈ తరహాలో అన్ని స్థాయిల్లోనూ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.
ఓబీసీ, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించనందుకు నిరసనగా ఎంఐఎం ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీనిపై మీ స్పందన ఏమిటి ?
వారు లేవనెత్తింది సరైన అంశమే అయినప్పటికీ మతపరంగా రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం అనుమతించదు. ఇకడ కొన్ని అవరోధాలు ఉన్నాయి. గతంలో కొన్ని రాష్ట్రాలు ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తే కోర్టులు వాటిని కొట్టివేశాయి. ఈ సమస్యకు రాజ్యాంగపరంగా ఇప్పటివరకు పరిషారం లభించలేదు.